ఎప్పటికప్పుడు దరఖాస్తుల నమోదు
ఈనెల 31నాటికి పూర్తి చేసేలా కసరత్తు
ఖమ్మంమయూరిసెంటర్: కొత్తగా అర్హులకు చేయూ త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తూనే ఎప్పటికప్పు డు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20వేల వరకు దరఖాస్తులు అంది నట్లు తెలిసింది. దరఖాస్తులన్నీ ఈనెల 31వ తేదీ నాటికి ఆన్లైన్లో నమోదు చేయాలని ఉన్నతాధికా రులు ఆదేశించారు. దీంతో మండల, మున్సిపల్ కార్యాలయాల్లో రాత్రింబవళ్లు విడతలవారీగా పనిచేసేలా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు.
కేఎంసీలో రెండు షిఫ్టులు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే అత్యధి కంగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఇక్కడ 18మంది కంప్యూటర్ ఆపరేటర్లను కేటాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తొమ్మిది మంది, సాయంత్రం నుంచి రాత్రి వరకు మరో తొమ్మిది మంది ఆపరేటర్లను కేటాయించి దరఖాస్తులు ఆన్లైన్ చేయిస్తున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేస్తున్నారు. కేఎంసీలో అందిన 5,460 దరఖాస్తులకు గాను ఇప్పటి వరకు 3,371 విచారణ పూర్తి చేసి, 2,035 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. జిల్లాలో నేలకొండపల్లి మండలంలో అత్యల్పంగా 37 దరఖాస్తులే ఆన్లైన్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం వరకు 7,220 దరఖాస్తులు ఆన్లైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని మండల కేంద్రాలు, మున్సిపల్ ఆఫీసుల్లో నమోదు వేగంగా సాగుతోంది. దీంతో ఈనెల 31వ తేదీ నాటికి మిగిలిన దరఖాస్తులు కూడా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమయ్యే అవకాశముంది.


