ఖమ్మం సహకారనగర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 15వ తేదీన జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఖమ్మం పరేడ్ మైదానంలో ఆయన 9–30గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు.
నేర పరిశోధన, నిందితుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి
● పోలీసు కమిషనర్ సునీల్దత్
ఖమ్మంక్రైం: నేరాల పరిశోధన, నిందితుల గుర్తింపు ప్రక్రియ వేగంగా చేట్టేలా ట్రాకింగ్ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు, ఖమ్మం త్రీటౌన్ పోలీసుస్టేషన్ను బుధవారం తనిఖీ చేసిన ఆయన స్టేషన్ నిర్వహణ, కేసుల విచారణ, జనరల్ డైరీ రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఆధునాతన పద్ధతులను అందిపుచ్చుకుంటే పరిశోధన, నేరాల కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్’విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా ఈ–సమన్స్, ఈ–సాక్ష్యా వంటివి విస్తృతంగా ఉపయోగించాలని, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా వేయాలని సూచించారు. నగర ఏసీపీ రమణమూర్తి, సీఐ మోహన్బాబు సిబ్బంది పాల్గొన్నారు.
16వరకు ఇగ్నోలో
ప్రవేశాలకు అవకాశం
ఖమ్మం సహకారనగర్: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో ప్రవేశాలకు ఈనెల 16వ తేదీ వరకు అవకాశం ఉందని రీజినల్ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మంలోని పలు డిగ్రీ కళాశాలలు, జ్యోతిబాపూలే గురుకులాల్లో బుధవారం ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇగ్నోలో కోర్సులు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కే.వీ.రమణారావు తదితరులు పాల్గొన్నారు.
కలప స్మగ్లర్లకు
ఇంటి దొంగల అండ?
ఖమ్మంవ్యవసాయం: అక్రమంగా కలప రవాణా చేస్తుండగా ఖమ్మం నగర శివారులో మంగళవారం రాత్రి వాహనం పట్టుబడింది. దీనివెనుక అటవీ శాఖలోని ఓ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ప్రాంతం నుంచి వాహనంలో అనుమతి లేకుండా తుమ్మ కలప తరలిస్తున్న క్రమాన టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది. అయితే, కలప తరలించే వారు ముందుగానే ఆ ప్రాంత అటవీ ఉద్యోగికి సమాచారం ఇవ్వడమే కాక ఆయన చెప్పిన నంబర్కు రూ.3,500 ఫోన్పే ద్వారా చెల్లించినట్లు తెలిసింది. ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇవ్వడంతోనే కలప తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది. ఈ మేరకు విచారణలో అటవీ ఉద్యోగి ప్రమేయాన్ని గుర్తించారని సమాచా రం. ఈ వ్యవహారంపై అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా.. విచారణ జరుగుతోందని దాటవేసే ధోరణిలో సమాధానం ఇచ్చారు. ఇక ఇల్లెందు వైపు నుంచి కలప తరలిస్తూ మరో ట్రాక్టర్ కూడా పట్టుబడగా విచారిస్తున్నారు.
చుక్కనీరు
వృథా కావొద్దు..
నేలకొండపల్లి/ముదిగొండ: గ్రామాల్లో చుక్క నీరు వృథా అయినా సహించేది లేదని జిల్లా పంచాయతీ అధికారి డి.వినోద్కుమార్ పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం అజయ్తండా, చెరువుమాధారం గ్రామాల్లో బుధవారం తనిఖీ చేసిన ఆయన కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించారు. ఆతర్వాత పలువురి ఇళ్లలో ఇంకుడు గుంతలను పరిశీలించాక మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు వృథా కాకుండా లీకేజీలను అరికట్టడంపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. అంతేకాక ప్రజలు కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకుని వర్షపు నీరు భూమిలో ఇంకేలా చూడాలని తెలిపారు. కాగా, జలసిరి పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ గుంతల నిర్మాణం. దోమల నివారణకు ఫాగింగ్ తదితరఅంశాలపై సూచనలు చేశారు. అజయ్తండా పంచాయతీ సర్పంచ్ తేజావత్ శివాజీ, కార్యదర్శి బైరం దినేష్కుమార్ పాల్గొన్నారు. అలాగే, ముదిగొండ మండలం మల్లన్నపాలెం జీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీపీఓ వినోద్కుమార్ రికార్డులు పరిశీలించాక పన్ను వసూళ్ల వివరాలు ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శి తలారి జయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.


