● గిరిజన అభివృద్ధి శాఖ డీడీ ఫిరంగి ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
ఖమ్మంమయూరిసెంటర్: ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫిరంగి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించారు. తొలుత గిరిజన బాలుర కళాశాల పీఎంహెచ్ వసతిగృహంలో జెండా ఎగురవేయగా, జెడ్పీసెంటర్ నుంచి గిరిజన భవనం వరకు ఆదివాసీ సాంస్కృతిక కళారూపాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభలో డీడీ ఫిరంగి మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం సతీష్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, 1976 నాటి జీఓ ఆధారంగా పొందుతున్న ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నిర్వహిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ పి.రమేష్, ఏసీఎంఓ రాములు, వసతిగృహ సంక్షేమ అధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
బంజారా భవనం నుండి..
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లంబాడీల ఆధ్వర్యాన బంజారా భవనం నుండి గిరిజన భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడారు. ఆదివాసీ విద్యార్థులు, లంబాడీ విద్యార్థులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. లంబాడీ విద్యార్థులు ఉదయం, ఆదివాసీలు మధ్యాహ్నం తర్వాత సభ నిర్వహించుకునేలా సమన్వయం చేశారు.


