● మూడో మహిళ కోరిందని రెండో భార్య తల్లి హత్య ● ఆపై మృతదేహాన్ని తగలబెట్టిన నిందితులు
సత్తుపల్లి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళను తన అత్త, భార్య తిట్టి, కొట్టి అవమానించారనే కోపంతో వృద్ధురాలిని హత్య చేసిన ఆమె అల్లుడితో పాటు ఆయనతో సంబంధం కలిగిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సత్తుపల్లి పోలీస్స్టేషన్లో ఆదివారం వైరా ఏసీపీ సారంగపాణి వివరాలను వెల్లడించారు. సత్తుపల్లి మండలం తుమ్మూరుకు చెందిన గుండాల వెంకటనరసమ్మ (65) కుమార్తె మంగను వెదుళ్ల తిరుపతిరావు వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే మరో మహిళను పెళ్లాడినా ఆమెను వదిలేసి మంగతో పాటు తుమ్మూరులో ఉంటున్నాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన పగుట్ల సునీతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతుండగా, ఇటీవల వెంకటనర్సమ్మ, మంగ కలిసి వెళ్లి దుద్దిపూడిలో పని చేస్తున్న సునీతను తిట్టి, కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన సునీత తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలంటే వెంకటనరసమ్మను హతమార్చాలనితిరుపతిరావుకు సూచించింది.
ఇంట్లో టీవీ చూస్తుండగా..
ఈ నెల 2వ తేదీన వెంకటనర్సమ్మ ఇంట్లో ఉండడాన్ని గమించిన తిరుపతిరావు, సునీత వెనుక నుంచి వెళ్లి చీర కొంగును ఆమె మెడను బిగించి హత్య చేశారు. అంతేకాక మృతదేహాన్ని అదేరోజు రాత్రి ద్విచక్ర వాహనంపై నారాయణపురం శివారుకు తీసుకెళ్లి అక్కడ చెత్తాచెదారం వేసి బైక్ నుంచి పెట్రోల్ తీసి తగలబెట్టారు. మరుసటి రోజు రాత్రి మళ్లీ వెళ్లేసరికి మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో భాగాలను మరికొంత దూరం తీసుకెళ్లి పూర్తిగా తగలబెట్టారు. తొలుత వెంటనర్సమ్మ కానరావడం లేదని అందిన ఫిర్యాదుతో విచారిస్తుండగా.. ఆమెను హత మార్చినట్లు తిరుపతిరావు గ్రామ సర్పంచ్ వీరబాబు, జీపీఓ లక్ష్మణ్కు చెప్పాడు. దీంతో పోలీసులు తిరుపతిరావు, సునీతను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో సత్తుపల్లి పట్టణ ఎస్ఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్ఐలు వీరప్రసాద్, ప్రదీప్ పాల్గొన్నారు.


