నేలకొండపల్లి/ముదిగొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాల్సిందేనని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర శుక్రవారం నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో హేమంతరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశసంపదను వారికి కట్టబెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీరం చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను గాలికొదిలేశాయన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షలు, ఆదాయం రెట్టింపు వంటి హామీలను కేంద్రం విస్మరించడంతో నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం పెరిగిందని, సంక్షోభంతో రైతులు, సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని పేర్కొన్నారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడమే ప్రజాపోరు యాత్ర లక్ష్యమని హేమంతరావు తెలిపారు. కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహ్మద్ మౌలానా, నాయకులు జితేందర్రెడ్డి, యర్ర బాబు, కర్ణకుమార్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లేబోయిన ఉపేందర్, కాశిబోయిన అయోధ్య, ఆలేటి మహేశ్, బాలిన కృష్ణంరాజు, రావెళ్ల కృష్ణ, పెద్దపాక నాగరాజు, ఏపూరి లలితాదేవి, కొండపర్తి గోవిందరావు, రావులపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాచైతన్య యాత్రలో
సీపీఐ నేత హేమంతరావు


