● తొలుత మధిర నియోజకవర్గంలో అమలు ● ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి
మధిర/ఖమ్మం సహకారనగర్: ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, జూనియర్ కాలేజీల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు మధిర వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సింగరేణి సహకారంతో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ – అక్షయపాత్ర ఆధ్వర్యాన మెగా కిచెన్ను నిర్మించారు. అంతేకాక మధిర నియోజకవర్గంలోని పాఠశాలలు, కాలేజీల విద్యార్థులకు పైలట్ ప్రాజెక్టుగా అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. ఈకార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ పరిధిలోనిపాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, జూనియర్ కాలేజీల విద్యార్థులకు అల్పాహారం మొదలుకానుంది. అయితే, కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం భోజనం పంపిణీ కూడా మొదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.
245 స్కూళ్లు, ఆరు కాలేజీలు..
జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల విద్యార్థులకు అల్పాహారం, భోజనం తయారీ కోసం కోసం మధిరలో మెగా కిచెన్ నిర్మించారు. ఈమేరకు తొలుత మధిర నియోజకవర్గంలోని 245 ప్రభుత్వ పాఠశాలలు, ఆరు జూనియర్ కాలేజీల విద్యార్థులకు అల్పాహారం పంపిణీని డిప్యూటీ సీఎం భట్టి సోమవారం ప్రారంభిస్తారు. దీంతో 245 పాఠశాలల్లో 12,142మంది, ఆరు జూనియర్ కాలేజీల్లోని 971మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. మధిరలో పంపిణీ ఓ కొలిక్కి వచ్చాక దశల వారీగా మిగతా నియోజకవర్గాలకు విస్తరించనున్నారు. డిప్యూటీ సీఎం ప్రారంభించే ఈ కార్యక్రమంలో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస స్వామీజీ, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, ఇంటర్ విద్య కమిషనర్ అభిలాష అభినవ్ పాల్గొంటారు. కాగా, అల్పాహార పథకం పంపిణీపై డీఈఓ సదానందం ఆదివారం విద్యాశాఖ సూపరింటెండెంట్లు, సెక్టోరియల్ అధికారులు, మధిర నియోజకవర్గంలోని ఎంఈఓలు, హెచ్ఎంలతో సమావేశమైన సూచనలు చేశారు.


