మధిర: ప్రయాణికులకు వసతులు కల్పించడమే కాక వారి భద్రతకు పెద్దపీట వేస్తున్నామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) మోహిత్ సోనాకియా వెల్లడించారు. మధిర రైల్వేస్టేషన్లో బుధవారం ఆయన తనిఖీ చేశారు. మధిర స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోకి మారాక డీఆర్ఎం పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా విజయవాడ – మధిర రైల్వే మార్గంలో ట్రాక్ల పరిస్థితి, భద్రతా ప్రమాణాలు, వంతెనల స్థితి, స్టేషన్ల పనితీరుపై ఆరా తీశారు. ఎర్రుపాలెం, మధిర రైల్వే స్టేషన్లతో పాటు బ్రిడ్జిని పరిశీలించాక, మధిర స్టేషన్లో రూ.24 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిసరాల్లో అస్తవ్యస్తంగా కేబుల్ వైర్లు, ప్లాట్ఫారంపై పగుళ్లను గమనించిన ఆయన వ్యర్థాలు తొలగించాలని సూచించారు. అలాగే, ప్లాట్ఫారం–1 వద్ద ఉన్న టీ స్టాల్ను ఫుట్ ఓవర్ బ్రిడ్జి కిందకు మార్చాలని తెలిపారు. అంతేకాక స్తంభాల మార్పు, బెంచీల ఏర్పాటుపై సూచనలు చేయగా, స్టేషన్లో అపరిశుభ్రత నెలకొనడంపై డీఆర్ఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, స్టేషన్లో వసతులు కల్పించడమే కాక పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని సీపీఎం నాయకులు డీఆర్ఎం మోహిత్ సోనిక్యా వినతిపత్రం అందజేశారు. సీపీఎం పట్టణ, మండల కార్యదర్శులు పడకంటి మురళి, మందా సైదులు తదితరులు ఉన్నారు.
విజయవాడ డీఆర్ఎం మోహిత్


