ఖమ్మం సహకారనగర్: నిర్మల్ జిల్లా డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్.శ్రీనివాసరావును ఖమ్మం డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా నియమించారు. ఆయనను డిప్యూటేషన్పై ఇక్కడకు కేటాయిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ బి.వెంకటనర్సమ్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం డీఈఓ కార్యాలయ ఏడీ వి.రాజేశ్వర్ సెలవులో ఉన్న నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీజనల్ వ్యాధుల
కట్టడిపై దృష్టి
తల్లాడ: అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున కట్టడిపై దృష్టి సారించినట్లు జిల్లా మలేరియా అధికారి కె.వెంకటేశ్వర్లు తెలిపారు. తల్లాడ మండలం మల్సూర్తండా గ్రామంలో శుక్రవారం ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ శిరీషతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే, గ్రామస్తులతో మాట్లాడుతూ ఇళ్లలోనే కాక పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని తెలిపారు. ఖాళీ పాత్రలు, డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉంచొద్దని, రెండు రోజులకు పైగా జ్వరం తగ్గకపోతే ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రత్యూష, శిరీష, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థులకు నోట్ పుస్తకాలు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు నోట్ పుస్తకాలు వచ్చాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల కావొస్తుండగా, ఈసారి నోట్ పుస్తకాల పంపిణీలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలు జిల్లా కేంద్రంలోని టేకులపల్లి గురుకులానికి చేరాయి. అక్కడి నుంచి వాహనాల్లో మిగతా గురుకులాలకు అధికారులు చేరవేస్తున్నారు.


