ఖమ్మంమయూరిసెంటర్: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద శుక్రవారం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. సభకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని డిపోల నుంచే కాక ఇతర ప్రాంతాల ఆర్టీసీ బస్సులను సైతం కేటాయించారు. జిల్లాలోని పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను పూర్తి స్థాయిలో సభకు కేటాయించగా, ఖమ్మం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. గ్రామీణ రూట్లతో పాటు సూర్యాపేట, కోదాడ, వరంగల్, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి వైపు వెళ్లే సర్వీసులన్నీ నిలిచిపోయాయి. కేవలం సూపర్లగ్జరీ, ఏసీ బస్సులు మాత్రమే నడపడంతో సాధారణ, పేద ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఖమ్మం పాత, కొత్త బస్టాండ్లలో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. కొందరు చేసేదేం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. బస్సులన్నీ సభకు పంపించి, తమను వదిలేశారంటూ ప్రయాణికులు బస్టాండ్లలో అధికారులను నిలదీయడం కనిపించింది.
సభకు 3,500 బస్సులు
సభకు హాజరైన ప్రజలు, రైతులు, మహిళల కోసం ఆర్టీసీ అధికారులు 3,500 బస్సులు ఏర్పాటు చేశారు. ఖమ్మం ఆర్ఎం ఏ.సరిరామ్ ఆధ్వర్యాన డిపో మేనేజర్లు ఏర్పాట్లను సమన్వయం చేయగా.. కరీంనగర్ జోన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబూరావు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీందర్ పర్యవేక్షించారు. రాకపోకలు సాఫీగా సాగేలా ఉద్యోగులకు సూచనలు చేశారు. సభా ప్రాంగణం నుంచి రాత్రి 9 గంటలకు చివరి బస్సు వెళ్లే వరకు పర్యవేక్షించారు.
బస్టాండ్లలో ప్రయాణికుల విలవిల


