ఖమ్మం సహకారనగర్: మత్తు పదార్థాల వినియోగంతో ఎదురయ్యే దుష్పరిమాణాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఈగల్ టీం ఇన్స్పెక్టర్ విజయ్కుమార్, విద్యాశాఖ సీఎంఓ బాబోజు ప్రవీణ్కుమార్ అన్నారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ – సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్, ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో మత్తు పదార్థాల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను అప్రమత్తం చేయడమే కాక ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లు ఆనవాళ్లు ఉంటే 1908 నెంబర్కు తెలియచేయాలని సూచించారు. ఈ అవగాహన సదస్సుకు జిల్లాలోని 22 పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం చిత్రలేఖనం, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ శైలజాలక్ష్మీ, హెచ్ఎంలు దుర్గాభవాని, రమేష్, సైకాలజిస్టులు సుప్రియ, డీఆర్పీలు భాస్కర్రావు, రాము, రాంబాబు పాల్గొన్నారు.
మద్యానికి బానిసై ఆత్మహత్య
తిరుమలాయపాలెం: మద్యానికి బానిస కావడంతో పాటు మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని కాకరవాయికి చెందిన దారమల్ల శ్రీను కుమారుడు దారమల్ల మహేష్(35) మద్యానికి బానిస కావడంతో పాటు మానసిక స్థితి సరిగా ఉండడం లేదు. ఈక్రమాన గురువారం గ్రామంలోని శ్మశాన వాటిక సమీపాన గడ్డి మందు తాగిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎనిమిది ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: చింతకాని మండలంలోని తిమ్మినేనిపాలెం, చిన్నమండవ, ముదిగొండ మండలంలోని గంధసిరి మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను సీజ్ చేశారు. శుక్రవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఇసుక తరలింపునకు అనుమతి లేదని తేలడంలో సీజ్ చేసినట్లు వైరా సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. కాగా, ట్రాక్టర్ల బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ వెల్లడించారు.
రూ.10 లక్షలకు ఐపీ దాఖలు
ఖమ్మం లీగల్: కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన మేకల తిరుపతిరావు, మేకల గోపి, మేకల ముత్తయ్య, మేకల యల్లయ్య రూ.10.90లక్షలకు ఐపీ దాఖలు చేశారు. వ్యాపార అభివృద్ధి కోంస పలువురి వద్ద అప్పు తీసుకోగా, ఇప్పుడు తీర్చలేని పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. ఈమేరకు వారు 11మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం ఐపీ దాఖలు చేశారు.
18 సిలిండర్లు సీజ్
ఖమ్మంరూరల్: నిబంధనలకు విరుద్ధంగా గృహావసర సిలిండర్లు వినియోగిస్తున్న హోటళ్లు, దాబాల్లో శుక్రవారం సివిల్ సప్లయీస్ అధికారులు తనికీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్, కోదాడ క్రాస్ రోడ్లలోని శ్రేష్ట, బాటిల్ రెస్టారెంట్, చౌదరి హోటల్, కింగ్స్ దాబా, శ్రీచౌదరి, శివాజీ హోటళ్లలో 18 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి బాధ్యులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీ విజయబాబు తెలిపారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్ఐ కృష్ణ, సివిల్ సప్లయ్ ఆర్ఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


