మధిర: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే సాగులో మంచి ఫలితాలు వస్తాయని మధిర ఏడీఏ విజయచంద్ర తెలిపారు. ఈ విషయంలో ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి కోటేశ్వరరావు ఆధ్వర్యాన శుక్రవారం మధిర రైతు వేదికలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏయే పంటల్లో ఎరువులు ఎప్పుడు, ఎంత మోతాదులో వేయాలి, నానో యూరియా, డీఏపీతో ఉపయోగాలను వివరించారు. అనంతరం మధిర ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణీదేవి మాట్లాడుతూ వరి, అపరాల్లో ఉన్న వంగడాల ప్రత్యకతలపై అవగాహన కల్పించారు. ఆతర్వాత ఎంటమాలజీ శాస్త్రవేత్త నాగస్వాతి మాట్లాడుతూ చీడపీడల నివారణ, సాయిల్ హెల్త్ కార్డు ఉపయోగాన్ని వివరించగా.. మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడారు. ఆతర్వాత ఎరువులు, పురుగుల మందుల పిచికారీకి అందుబాటులో ఉన్న డ్రోన్ల ఉపయోగాలను వివరించారు. మార్కెట్ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.


