రఘునాథపాలెం: నూతన సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఈనెల 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. రఘునాథపాలెం రైతు వేదికలో మండలంలోని సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులకు శుక్రవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, జీపీల్లో పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలని, ఏవైనా తిరస్కరిస్తే స్పష్టమైన కారణం తెలియచేయాలని పేర్కొన్నారు. తొలుత ఆయన రఘునాథపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు, పెండింగ్ ఫిర్యాదులు, ఫైళ్లను పరిశీలించి సూచనలు చేశారు. అలాగే, బస్తీ దవాఖానాను తనిఖీ చేసి ఓపీ సేవలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీపీఓ రాంబాబు, సర్పంచ్ గాజుల కృష్ణారావు, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ కార్యదర్శి అనురాధ, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
అంధుల పాఠశాల నిర్మాణం పూర్తిచేయాలి
ఖమ్మం సహకారనగర్: అంధుల విద్యాభివృద్ధి కోసం అత్యున్నత ప్రమాణాలతో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జెడ్పీ సెంటర్లోని నిజాంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న పాఠశాల పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై సూచనలు చేశాక వేగం పెంచాలని తెలిపారు. అంధ విద్యార్థులకు డిజిటల్ ఆడియో డివైజ్లు, బ్రెయిలీ లిపి పరికరాల ద్వారా బోధనను పరిశీలించారు. కాగా, అంధ విద్యార్ధిని జి.భవానీ తమకు అధునాతన సౌకర్యాలు కల్పించడంపై కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, ఈ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న సెన్సార్ రూమ్, గార్డెన్ ద్వారా అంధ విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, పంచాయతీరాజ్ ఈఈ మహేష్బాబు, సీఎంఓ ప్రవీణ్కుమార్, ఏఈ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


