● ఒకటి, రెండు రోజుల్లో పంపిణీకి ఏర్పాట్లు ● 120 గజాల చొప్పున ఇవ్వాలని నిర్ణయం?
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కూల్చివేతల కారణంగా ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. కూల్చివేతల్లో 700కు పైగా నివాసాలను తొలగించారు. వీరికి ఖమ్మం అంబేద్కర్ భవన్, టీటీడీసీలో పునరావాసం ఏర్పాటుచేయగా, ధ్రువపత్రాల ఆధారంగా సర్వే చేస్తూ అర్హుల జాబితా రూపొందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా తేలిన వారికి ఒకటి, రెండు రోజుల్లో పట్టాలు అందించే అవకాశముందని తెలిసింది.
స్వస్థలం.. ప్రభుత్వ పథకాలు
ఇళ్లు కోల్పోయిన వారి ఆధార్ కార్డులు, ఇతర పత్రాలతో అధికారులు సర్వే చేపట్టారు. స్వస్థలంలో ఆస్తి లేకపోవడం, ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలం లేదా ఇల్లు పొందని నిరుపేదలతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 290 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నివాసాలు కోల్పోయారు. ఇందులో అర్హులుగా తేలిన వారికి 120గజాల చొప్పున స్థలం కేటాయించే అవకాశముంది. ఖమ్మం చుట్టుపక్కల బల్లేపల్లి, రఘునాథపాలెం మండలం వీవీ.పాలెం, అల్లీపు రం, ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. స్థలాల గుర్తింపు పూర్తిచేశాక సర్వేలో అర్హులుగా తేలిన వారికి పట్టాలు అందించే అవకాశన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కూల్చివేతల అంశం పట్టాల పంపిణీతో ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక పట్టాలు ఇచ్చాక అంబేద్కర్ భవనం, టీటీడీసీ కేంద్రాల నుంచి ఖాళీ చేయించే అవకాశముంది.


