హమ్మయ్య.. అంతా ప్రశాంతం !
మధిర మడుపల్లి బూత్లో ఓటు వేయడానికి వచ్చిన మహిళ బిడ్డను లాలిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మి
సాక్షి నెట్వర్క్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. అధికారుల నిత్య సమీక్షలతో పాటు నిరంతర పర్యవేక్షణలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలింగ్ పూర్తయింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారం, ఎత్తుగడల్లో నిమగ్నమైన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి జలగంనగర్లోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. అలాగే, కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎన్నికల పరిశీలకులు పవన్కుమార్, డీఆర్వో పద్మశ్రీ, సీపీఓ శ్రీనివాస్ పరిశీలిస్తూ ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, కల్లూరులోని పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. అంతేకాక కల్లూరు మున్సిపల్ పరిధిలోని కేంద్రాల్లో పోలింగ్ను కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ పరిశీలించి వివరాలు ఆరా తీశారు.
●వైరా, ఏదులాపురం, కల్లూరు తదితర మున్సిపాలిటీల్లో కేంద్రాలకు సీపీ సునీల్దత్ పరిశీలించి బందోబస్తుపై సూచనలు చేశారు. అడిషనల్ డీసీపీ రామానుజం, కల్లూరు, వైరా, రూరల్ ఏసీపీలు వసుంధర యాదవ్, సారంగపాణి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
●వైరా మున్సిపల్ 12వ వార్డు అభ్యర్ధి మాదినేని నాగరాణికి 20వ వార్డులో ఓటు హక్కు ఉంది. ఆమె ఉదయం నుంచి వార్డులో పోలింగ్ను పరిశీలిస్తూ చివరకు భర్త లక్ష్మణ్తో కలిసి 20వ వార్డుకు వెళ్లేసరికి సమయం దాటడంతో గేట్లు మూసేశారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు.
హమ్మయ్య.. అంతా ప్రశాంతం !


