యూరియా.. రోజుకో తీరయా!
● యాప్తో ఇప్పటికే రైతులకు ఇక్కట్లు ● ఆపై బుకింగ్లో తరచూ మార్పులు చేస్తున్న యంత్రాంగం
ఖమ్మంవ్యవసాయం: సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఫర్టిలైజర్ యాప్తో ద్వారా యూరియా బుకింగ్కు రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత వానాకాలం సీజన్ మాదిరి ఇక్కట్లు ఎదురుకావొద్దని ప్రభుత్వం యాప్నుప్రవేశపెడితే అంతకు మించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాగుకు అనుగుణంగా అవసరమైనంత వరకే యూరియా తీసుకునేలా యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలుచేస్తున్నారు. అయితే, తొలుత జిల్లా యూనిట్గా అవకాశం కల్పించగా.. స్టాక్ ఉన్న చోటుకే రైతులంతా వస్తుండడంతో స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీనికి తోడు రైతులు దూర ప్రాంతంలోని డీలర్, పీఏసీఎస్ను ఎంచుకుని వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో డివిజన్ యూనిట్గా నాలుగు, ఐదు మండలాల్లో ఎక్కడైనా యూరియాను బుక్ చేసుకునేలా తొలుత మార్పు చేశారు. ఈ విధానంలోనూ సమస్యలు రావడంతో ఇప్పుడు మండలం యూనిట్గా యూరియా బుకింగ్కు అవకాశం కల్పించారు.
ఫోన్లు లేక ఇక్కట్లు
గ్రామీణ ప్రాంత రైతులకు స్మార్ట్ఫోన్లు లేక.. ఉన్నా యాప్ వినియోగంపై అవగాహన లేక గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైతులు ఆందోళన తెలిపారు. కాగా, యాప్లో యూరియా బుక్ చేసుకున్నా పాస్బుక్, ఆధార్ కార్డుతో సహకార సంఘం లేదా డీలర్ వద్దకు వెళ్లక తప్పడం లేదు. ఈనేపథ్యాన రైతులు పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈవిషయమై జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య మాట్లాడుతూ రైతులు కొత్త విధానానికి అలవాటు పడక తప్పదని తెలిపారు. అయితే, బుకింగ్లో ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


