ఐఆర్ఏడీతో రోడ్డు ప్రమాదాల కట్టడి
● డేటా ఆధారంగా ప్రమాదాలకు కారణాల విశ్లేషణ ● బ్లాక్స్పాట్ల వద్ద అధికారుల పరిశీలన
ఖమ్మం అర్బన్/కామేపల్లి: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్(ఐఆర్ఏడీ) యాప్ కీలకం కానుంది. ఈ మేరకు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు ఐఆర్ఏడీలో నమోదైన వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో రెండు రోజులుగా అధికారులు పరిశీలిస్తూ వివరాలు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలం, సమయం, వాహనాల వివరాలు, ప్రమాదానికి కారణాలను యాప్లో పొందుపరిస్తే వివరాల విశ్లేషణ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించే అవకాశముంటుందని చెబుతున్నారు. తద్వారా ఆయా ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉంటే సరిచేయడమే కాక ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురుకాకుండా నిర్వహణపై దృష్టి సారించనున్నారు.
కారణాలు ఏమిటి?
ఖమ్మంలోని జెడ్పీ జంక్షన్, మమత హాస్పిటల్ రోడ్, ఇల్లెందు రోడ్డులోని బూడిదంపాడు, ధంసలాపురంతో పాటు కామేపల్లి మండలంలోని ముచర్ల క్రాస్, లింగాల క్రాస్, ధంసలాపురం ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు గురువారం సంయుక్త తనిఖీలు చేపట్టారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఐఆర్ఏడీ డీఆర్ఎం హరిబాబుతో పాటు రవాణా, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దినెలలుగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలపై ఆరా తీసిన అధికారులు అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు.
అప్పటికప్పుడే భద్రతా ఏర్పాట్లు
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పరిశీలన సందర్భంగా అధికారులు కారణాలపై ఆరా తీశారు. ఈమేరకు రంబుల్ స్ట్రిప్లు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుతో పాటు జీబ్రా క్రాసింగ్లు, మార్కింగ్ చెరిగిపోయిన చోట కొత్తగా ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేకాక పోలీసు, రవాణా, వైద్య, ఆరోగ్యం, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్న సూచనలతో ఈ తనిఖీలు చేపట్టడమే కాక పలుచోట్ల తక్షణ చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే ఖమ్మంలోని పలు రహదారులపై మార్కింగ్ వేయించారు.
ఐఆర్ఏడీతో రోడ్డు ప్రమాదాల కట్టడి


