
సైద్ధాంతిక భావజాలం పెంపొందించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఏ సిద్ధాంతమైనా ఆచరణ నుంచి రావాలని.. ఆచరణ కోసం అధ్యయనం చేయడమే కాక విద్యార్థుల్లో సైద్ధాంతిక భావజాలా న్ని పెంపొందించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ ఐదో రాష్ట్ర మహాసభల్లో రెండో రోజైన శనివారం నాగేశ్వర్ ప్రారంభోపన్యాసం చేశా రు. ఆలోచనల పోరాటంలో ఎస్ఎఫ్ఐ ముందుండాలని, విద్యార్థుల దైనందిన సమస్యలను ప్రాపంచిక దృక్పథంతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా రంగం నాడు బలంగా ఉండేదని.. అదే సామాజిక చైతన్యానికి కారణమై ఉండొచ్చని విశ్లేషించారు. పార్లమెంట్కు కూడా రాజ్యాంగాన్ని మార్చే అర్హత లేదని, లౌకికతత్వం, సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ల మూత
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఆదివాసీలు రాష్ట్రంలోని 11జిల్లాల్లో ఉన్నారని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యాసంస్థలను మూసి వేస్తున్నారని, నూతన విద్యావిధానం పేరుతో ఏడాదికాలంలో 300 స్కూళ్లను మూసివేశారని పేర్కొన్నారు. ఇక 23ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక్కరు కూడా తెలుగు వచ్చిన ఉపాధ్యాయులు లేకపోవడం.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నూతన విద్యావిధానం పేరుతో కాషాయీకరణ చేస్తూ, చరిత్రను మార్చి వేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభలకు జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు రూ.3.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. సభలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, జాతీయ నాయకుడు ఎస్.వీరయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఏఐడీఎస్ఓ రాష్ట్ర నాయకులు మల్లేశ్, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీ.పీ.సాను, ఉపాధ్యక్షుడు ఆదిత్యనారాయణ్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజుతో పాటు రవిమారుత్, ఐ.వీ.రమణారావు, కొప్పిశెట్టి సురేశ్, సుధాకర్, ప్రవీణ్, ఎం.సుబ్బారావు, కోట రమేష్, భూక్యా వీరభద్రం, రజిని, మూడు శోభన్నాయక్, కళ్యాణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తరగతి గది – సమాజాన్ని
అనుసంధానం చేయాలి
ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభల్లో వక్తలు