ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి
బోనకల్: భర్త వదిలేసినా, ఇద్దరు కుమారులు మానసిక వైకల్యంతో బాధపడుతున్నా బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ కుమారుడిని బావి మింగేసింది. ఆ కుటుంబంతో పాటు, స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు... జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన షేక్ రేష్మాకు ఓ కుమార్తెతో పాటు మానసిక దివ్యాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమెను భర్త వదిలివేసినా అధైర్యపడకుండా పిల్లలతో కలిసి చింతకాని మండలం ప్రొద్దుటూరుకు వచ్చి గుడారం వేసుకుని జీవనం సాగిస్తోంది. పాత రాతెండి సామగ్రి కొనడం, మరమ్మతు పనులతో పొట్ట పోసుకుంటుండగా, శుక్రవారం పెద్దకుమారుడు యాకూబ్(15) బోనకల్ మండలం లక్ష్మీపురం పరిధి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. దీంతో నీటమునిగిన ఆయన మృతి చెందగా తల్లి సహా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, వారి కుటుంబ పరిస్థితి దృష్ట్యా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బీఆర్ఎస్ నాయకుడు పెంట్యాల పుల్లయ్య ఆటో సమకూర్చగా, స్థానికులు రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈమేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.
బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
తిరుమలాయపాలెం: కొద్ది రోజులుగా మండలంలోని మేడిదపల్లి ప్రాంతంలో తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(30) వ్యవసాయ బావిలో మృతదేహంగా తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మతిస్థిమితం లేని సదరు వ్యక్తి మేడిదపల్లిలో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తినేవాడు. ఈక్రమాన మేడిదపల్లి – మేకలతండా మార్గంలో వ్యవసాయ బావిలో ఆయన మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఈమేరకు పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59136, 87126 59137 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ కూచిపూడి జగదీష్ సూచించారు.
బతుకుదెరువుకు వలస వచ్చిన
కుటుంబంలో విషాదం
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి


