బళ్లారి అర్బన్: సిరుగుప్ప తాలూకా దరూర్ గ్రామంలోని వీరభద్రస్వామి జాతర ముగిసింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు వేలాది మంది భక్తుల సమక్షంలో జాతర వైభవంగా జరిగింది. శ్రావణ మాసం మొదటి సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు.. శుక్రవారం రథపూజ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి వీరేశయ్య స్వామి ఆధ్వర్యంలో ఆలయ పన్ను వసూలుదారులు, మేటీలు, తళ్వార్లు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం రథంలోని విగ్రహాన్ని కిందకు దించి, పూలమాలలు, అరటి దిండ్లను తొలగించారు. రథాన్ని శుభ్రంగా కడిగి, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథాన్ని యథాస్థానానికి తరలించారు. కార్యక్రమంలో మేటీలు పంపనగౌడ, వినోద గౌడ, మారబసప్ప నాయక, కెంపన్నవర వీరేష్ నాయక, తల్వార్ చంద్రనాయక, బంకాడ మానే వీరేష్, ముదియప్ప నాయక, కెంపన్నవర రుద్ర నాయక, డాక్టర్ పురుషోత్తం గౌడ తదితరులు పాల్గొన్నారు.


