రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ గట్టు కాలువలో కొందరు అనధికారికంగా పైపులు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని దారి మళ్లిస్తూ జలచౌర్యానికి పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేయగా.. గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయుకట్టు భూములకు నీరందించేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదు. ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. సిరవార, మటమారి, మస్కి, కవితాళ, రాయచూరు ప్రాంతాల్లో కంది, వరి, పత్తి, మిరప సాగు చేశారు. చివరి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. 4,100 క్యూసెక్కుల నీరు పైభాగంలో వాడేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.


