హొసపేటె: హుబ్బళ్లి చేనేత అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న 2018వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి గరీమా పన్వర్ను విజయనగర జిల్లా పంచాయతీ కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారిణిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విజయనగర జెడ్పీ సీఈఓగా ఉన్న నోంగ్జాయ్ మహమ్మద్ అక్రమ్ షాను మంగళూరులోని మెస్కాం మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా త్వరలో గరీమా అధికార బాధ్యతలు చేపట్టనున్నారు.
పీఓపీ గణేశ్ విగ్రహాలు వద్దు
హొసపేటె: పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గణేష్ చతుర్థి పండుగకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన గణేశ్ విగ్రహాల తయారీ, సేకరణ, అమ్మకం, వినియోగం, విసర్జనను జిల్లా వ్యాప్తంగా నిషేధించారు. ఈ ఏడాది పర్యావరణహిత గణేష్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. సహజమైన, జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాలు, ముఖ్యంగా సహజ మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రోత్సహించేందుకు, పీఓపీతో చేసిన, ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ థర్మాకోల్తో పూత పూసిన విగ్రహాలను పూర్తిగా నిషేధించినట్లు జిల్లాధికారిణి కవిత మన్నికేరి తెలిపారు.
ఫుట్పాత్ల తొలగింపుతో ఆందోళన
రాయచూరు రూరల్: నగరంలో పలు ప్రాంతాల్లో ఆక్రమించిన ఫుట్పాత్ల తొలగింపునకు నగరసభ, జిల్లా, పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. బుధవారం మహావీర్ సర్కిల్, క్లాత్ బజార్ తదితర చోట్ల ఆక్రమిత ఫుట్పాత్లను తొలగించారు. ఆ సమయంలో వ్యాపారస్తులు ఆందోళనకు దిగడంతో పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పి శాంతింప చేశారు.
గణేష్ మండపాల పరిశీలన
రాయచూరు రూరల్: జిల్లాలో 2,570 చోట్ల గణేష్ విగ్రహ ప్రతిష్టాపనకు తోడు ప్రశాంతంగా వాటిని నిమజ్జనం చేసే ప్రాంతాలను జిల్లాధికారిణి పూవిత మంగళవారం ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, పోలీస్ అధికారులు శాంతవీర, దాదావలి, ఉమేష్, మంజునాథ్, నగరసభ అధికారులతో కలిసి పరిశీలించారు. మావినకెరె చెరువుతో పాటు సమీపంలోని కాస్బావిలో నిమజ్జనానికి చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ విగ్రహాలను ఊరేగింపు జరిపే ప్రాంతాలను, వీధులను తనిఖీ చేసి అక్రమంగా ఫుట్పాత్లను తొలగించాలని అధికారులకు సూచించారు.
మెడికోలకు బ్లాక్ మెయిల్.. ముగ్గురు అరెస్ట్
రాయచూరు రూరల్: వైద్య విద్యార్ధులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన నగరంలో బుధవారం చోటు చేసుకుంది. సురేష్, కౌశిక్, మరొకరిని గ్రామీణ పోలీసులు అరె్స్ట్ చేశారు. వీరు సాయంత్రం వేళ భోజనం కోసం ధాబాలకు వెళ్లిన వైద్య విద్యార్ధుల ఫొటోలు, వీడియోలను తీసి డబ్బులివ్వకుంటే తల్లిదండ్రులకు చూపుతామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఎస్ఐ తిమ్మణ్ణ నాయక్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
యువత వ్యసనాలకు
బలి కారాదు
హుబ్లీ: ఆరోగ్యవంతమైన యువశక్తి దేశానికి నిజమైన భవిత, వారి వల్లే దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు కలుగుతుందని, అందువల్ల యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా నైతిక జ్ఞానాన్ని కలిగి ఉండాలని డిమాండ్స్ మనో వైద్య సమాజ కార్యకర్త ప్రశాంత్ పాటిల్ తెలిపారు. కర్ణాటక విద్యావర్థక సంఘం విఠల్ కళాశాలలో ఏర్పాటు చేసిన మత్తు పదార్థాల దుర్వినియోగం అరికట్టడంలో యువత పాత్ర గురించి ఆయన మాట్లాడారు. నేటి విద్యార్థులు కేవలం జల్సాలు, మత్తు పదార్థాలకు బానిస కావడం శోచనీయం అన్నారు. చిన్న వయస్సు నుంచే దురలవాట్లకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖా, ప్రముఖులు డాక్టర్ శరణప్ప, డ్యానియల్, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


