సాక్షి,బళ్లారి: నగర పాలికె పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో మంచినీరు సరఫరా పని చేసే వాటర్ వాల్వ్మ్యాన్ ప్రమాదవశాత్తు ఓవర్హెడ్ ట్యాంకులో పడి మృతి చెందాడు. మంగళవారం రాత్రి నగరంలోని కాకర్లతోట ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకును నింపబోయిన ఎర్రిస్వామి(36) ట్యాంకు నిండిందా, లేదా? అని పరిశీలనకు ట్యాంకు వద్దకు వెళ్లగా ప్రమాదశాత్తు కాలు జారి ఓవర్ హెడ్ ట్యాంకులో పడిపోవడంతో మృతి చెందాడు. ఎర్రిస్వామి రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బుధవారం ఉదయం ఎర్రిస్వామి మృతదేహం ట్యాంకులో తేలగా పాలికె సిబ్బంది భయాందోళన చెందారు. వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పాలికె సిబ్బంది డిమాండ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


