హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల ప్రజలు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి వచ్చే వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. డ్యాంకు ఎగువన ఉన్న శివమొగ్గ, ఆగుంబె, తీర్థహళ్లి, మొరాళ్లు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డ్యాం వస్తున్న ఇన్ఫ్లో రోజురోజుకు తగ్గింది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి ఇన్ఫ్లో గణనీయంగా పడిపోవడంతో జలాశయంలో నీటి నిల్వ క్రమంగా తగ్గుతోంది. డ్యాంలోకి బుధవారం కేవలం 675 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండగా, తాగునీటి అవసరాల కోసం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంకు వస్తున్న వరద కంటే బయటకు వెళ్తున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం వర్షాలు కురిసి మళ్లీ డ్యాంలోకి ఇన్ఫ్లో పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1629.32 అడుగులు, నీటినిల్వ 91.534 టీఎంసీలు, ఇన్ఫ్లో 675 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 9,802 క్యూసెక్కులుగా ఉందని మండలి అధికార వర్గాలు తెలిపాయి.


