కోలారు: ముళబాగిలు నగరంలోని జ్యోతినగర పాళ్యలో ఉన్న పురాణ ప్రసిద్ధ తుళసిరామ దేవాలయంలో శ్రీనివాస సమేత పద్మావతి దేవర కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయంలో గత వంద సంవత్సరాలకు పైగా ఏటా కళ్యాణోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. వేదపండితులు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులకు కనులపండువగా సాగింది.
పవిత్రగౌడ బ్యారక్ మార్పు!
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో బ్యారక్ను మార్చేందుకు 59వ సివిల్, సెషన్స్కోర్టు ఆమోదించింది. ఇప్పుడున్న బ్యారక్లో 30 మందికి పైగా ఉంటున్నారు, ఒక్కటే మరుగుదొడ్డి ఉండడంతో ఇబ్బందిగా ఉందని పవిత్ర కోర్టులో అర్జీ వేసింది. దీంతో మరో బ్యారక్లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు.
మళ్లీ హైకోర్టుకు దర్శన్
తనను వీడియో కాన్ఫరెన్స్లో కాకుండా నేరుగా కోర్టు వాయిదాలకు హాజరయ్యేలా అనుమతించాలని రెండవ నిందితుడు, నటుడు దర్శన్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన పిటిషన్ని భద్రతా కారణాల పేరుతో 59వ సీసీహెచ్ కోర్టు తిరస్కరించింది.
త్వరలో మరిన్ని కరువు తాలూకాలు: సీఎం
దొడ్డబళ్లాపురం: కరువుపీడిత తాలూకాలుగా ప్రకటించలేదని ఏ ఎమ్మెల్యే కూడా ఆందోళన చెందవద్దని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో చాలా తాలూకాలలో కరువు తాండవిస్తోందని, అన్ని విధాలుగా పరిశీలించి కరువు పీడిత తాలూకాలను ఎంపిక చేస్తున్నామన్నారు. మొదటి విడత మాత్రమే ప్రకటించామని రెండవ, మూడవ విడతల్లో మరిన్ని తాలూకాలను ప్రకటిస్తామని తెలిపారు. రైతుల సమస్యల గురించి చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుపుతామన్నారు. నైస్ పథకంపై చట్ట వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు.
వీధి వ్యాపారుల
పొట్ట కొట్టొద్దు
తుమకూరు: నగరంలో ఫుట్పాత్ దుకాణాలను కోర్టు ఆదేశాలంటూ కార్పొరేషన్ అధికారులు తొలగించి పొట్టకొడుతున్నారని వ్యాపారులు, కన్నడ, దళిత సంఘాల నాయకులు బృహత్ నిరసన నిర్వహించారు. ఇష్టానుసారం దుకాణాలను తొలగించడంతో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. వారికి జిల్లా యంత్రాంగం సహాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పార్కులు, రాజకాలువలను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన ధనికులను పట్టించుకోరా, పేదలే కనిపిస్తారా? అని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేసి, తరువాత కలెక్టరేట్కు వెళ్లి నిరసన తెలిపారు.
ఒంటరిని చేసిన నేపాల్
దొడ్డబళ్లాపురం: నేపాల్ విహారయాత్రకు వెళ్లిన బెంగళూరు దంపతులు అక్కడ వరదల్లో గల్లంతయ్యారు. ఇప్పటివరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కన్నవారు లేని అనాథగా జీవించాలా? అని ఆవేదన చెందుతోంది. అన్నందేవర వెంకటరావ్, అనఘ దంపతులు 67 మందితో కలిసి కై లాస పర్వత యాత్రకు వెళ్లారు. అయితే నేపాల్ విపత్తులో చిక్కుకుని అదృశ్యమయ్యారు. ఆగస్టు 30 తరువాత తల్లిదండ్రులతో మాట్లాడలేకపోయానని కుమార్తె తాన్వి కన్నీటిపర్యంతమవుతోంది. తాన్వి డీఎన్ఏతో ఏ మృతదేహం డీఎన్ఏ కూడా జత కాకపోవడంతో కన్నవారు బతికే ఉండవచ్చని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది.


