450 కేజీల ఇసుక మూటలతో నడక
మైసూరు: దసరా గజరాజులకు అప్పుడే బరువు మోసే తర్ఫీదును ప్రారంభించారు. దసరా జంబూసవారీ ఊరేగింపు కోసం గజరాజులను సిద్ధం చేస్తున్నారు. గజదళంలోని మగ ఏనుగులకు వీపుపై బరువులు మోయించారు. ఒక్కో ఏనుగుపై 450 కేజీల బరువున్న ఇసుక మూటలను ఉంచి నడిపించారు. క్రమంగా దానిని 1000 కేజీలకు పెంచుతారు. పూజారి ప్రసాద్ రావు అంబావిలాస్ ప్యాలెస్లోని సోమేశ్వర ఆలయం సమీపంలో ఏనుగులకు పూజలు చేసి బరువు మోతకు సాగనంపారు. ముఖ్య ఏనుగు మహేంద్రపై మంచం కట్టి ఇనుప ఊయలను బిగించారు. తరువాత ఒక్కొక్కటి 50 కేజీల బరువున్న 9 ఇసుక బస్తాలను ఉంచారు. అటవీ సిబ్బంది, మావటీలు జాగ్రత్తగా బిగించారు. ప్యాలెస్ నుంచి బన్నిమంటపం పరేడ్ మైదానం వరకు బరువు మోస్తూ నడిచింది. డీసీఎఫ్ ప్రభుగౌడ మాట్లాడుతూ మహేంద్ర, ప్రశాంత్, ఏకలవ్య, ధనంజయతో బరువులు మోయించే సాధన చేయిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫలితాలను బట్టి బంగారు అంబారీని మోసే గజరాజును ఎంపిక చేస్తామన్నారు.


