రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల ప్రజలు తాగు, సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఉత్తర కర్ణాటక నీటిని దక్షిణ కర్ణాటకకు మళ్లించడంతో పాటు ఆల్మట్టి డ్యాం నుంచి నీటిని తీసుకెళ్లడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. దక్షిణ కర్ణాటకలోని బయలుసీమ ప్రాంతాలైన కోలారు, చిక్కబళ్లాపూర్లకు నీటిని ఇవ్వాలని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించారు. గతంలో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు కూడా ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని ప్రజా ప్రతినిధులు మౌనం వహించారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు(యూకేపీ) మూడో విడతలో నీటి పంపకాల విషయంలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సర్కార్ ఐదేళ్లలోపు యూకేపీతో పాటు నీటిపారుదల రంగానికి రూ.2 లక్షల కోట్ల నిధులు వ్యయం చేస్తామన్న సర్కార్ నేటికీ చిల్లిగవ్వ కూడా నిధులు విడుదల చేయలేదు. బాగల్కోటెలో ఆల్మట్టి డ్యాం కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించలేదు.


