శ్రీనివాసపురం: జిల్లాలోని ముళబాగిలు తాలూకాలో ఉన్న పురాణ ప్రసిద్ధ కురుడుమలై వినాయక దేవస్థానంలో విఘ్ననాయకున్ని వెన్నతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా గురువారం ఉదయం నుంచి పార్వతీ తనయునికి పంచామృత అభిషేకం నిర్వహించి, ఆపై నవనీతంతో చక్కగా అలంకరించారు. ఏకదంతున్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
ఉపాధి పనుల్లో స్వాహా.. లోకాయుక్త దాడులు
తుమకూరు: ఉపాధి హామీ (వీబీజీ రామ్ జీ) పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై, లోకాయుక్త పోలీసులు తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలోని హగల్వాడి గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు రమేష్ ఇల్లు, గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ ఆఫీసుల్లో 6 చోట్ల దాడులు నిర్వహించారు. పీడీఓ శివకుమార్ ఇల్లు, మాజీ టెక్నికల్ అసిస్టెంట్ గోవిందరాజు ఇల్లు, గురు ఎంటర్ప్రైజెస్ అనే దుకాణం యజమాని ఇంటిలో తనిఖీలు చేసి ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. డ్రైనేజీ పనుల్లో రూ.2 కోట్లకు పైగా నిధులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి. పీడీఓ శివకుమార్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. లోకాయుక్త డీఎస్పీలు సంతోష్ కుమార్, మంజునాథ గౌడ, ఇన్స్పెక్టర్లు రాఘవేంద్ర, ఎన్. నిర్మల, రాజు, శాంతినాథ్ పాల్గొన్నారు. 2 రోజులు తనిఖీలు కొనసాగవచ్చని తెలిపారు.
తలుపు ఎందుకు
తట్టానంటే..: మంత్రి
శివాజీనగర: 2006లో హెచ్డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రోజుల పాటు అదృశ్యమయ్యారు, ఆయన ఎక్కడికి వెళ్లారో కనుగొనే బాధ్యతను దేవేగౌడ నాకే అప్పగించారు అని మంత్రి చెలువరాయస్వామి చెప్పారు. గురువారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామిపై విమర్శలు గుప్పించారు. ఉదయం 9 గంటలకు చెలువరాయస్వామి నా తలుపు తట్టారన్న కుమారస్వామి ఆరోపణలపై స్పందిస్తూ, నేను తలుపు తట్టడం గురించి మాట్లాడడం మొదలుపెడితే వాళ్లు నన్ను ఆపలేరన్నారు. కుమారస్వామి కనబడలేదని దేవేగౌడ నాకు చెబితే, నేను ఉదయం 5 గంటలకు తలుపు తట్టాను. నేను ఎవరి తలుపు తట్టానో వినాలనుకుంటే చెబుతాను అని హేళన చేశారు. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ సర్కారుపై కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే.
వాగులో దాక్కున్న రౌడీషీటర్
● చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు
శివమొగ్గ: పరారీలో ఉన్న ఓ రౌడీషీటర్ వాగులో దాక్కొని ఉండగా పోలీసులు చాకచక్యంగా బంధించారు. భద్రావతికి చెందిన రౌడీషీటర్ దిలీప్ అలియాస్ కరియాపై చోరీ, హత్యాయత్నంతో సహా 16 కేసులున్నాయి. ఒక కేసులో అతనిపై కోర్టు మూడుసార్లు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయినా అతను కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. భండారహళ్లి వాగు వద్ద నిందితుడు దిలీప్ తలదాచుకున్నట్లు తెలుసుకొని పోలీసులు అక్కడకు వెళ్లారు. అయితే దిలీప్ జాడ కనిపించలేదు. కానీ నీటిలో నుంచి గాలి బుడగలు పైకి వస్తుండటాన్ని ఎస్ఐ రమేష్ గమనించారు. దీంతో అతను కానిస్టేబుల్ ప్రసన్నతో కలిసి వాగులోకి దిగి గాలించి దినేష్ను బంధించారు.


