యశవంతపుర: సీనియర్ కన్నడ నటుడు దునియా విజయ్, భార్య నాగరత్న విడిపోయారు. వారి విడాకుల కేసు కొన్నేళ్లు నుంచి కోర్టులో నడుస్తోంది. హైకోర్టు వారికి విడాకులను మంజూరు చేసింది. దునియా–నాగరత్నలు 1999లో పెళ్లి చేసుకోగా, గొడవలు వచ్చి 2013లో మొదటిసారిగా విడాకులకు కోర్టుకు వెళ్లారు. 2014లో రాజీ అయి కేసును విత్డ్రా చేసుకున్నారు. 2018లో తన భార్య వేధిస్తోందని విజయ్ మళ్లీ శాంతినగర ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరాడు. 2024 విచారణలో విజయ్ తన ఆరోపణలకు ఆధారాలను చూపలేకపోవడంతో అర్జీని కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కాడు. ఇరుపక్షాల వాదనలను ఆలకించిన కోర్టు.. వారి దాంపత్య బంధానికి చట్ట ప్రకారం ముగింపు పలికింది.
విజయ్ ఆనందం
విడాకుల సంగతిని విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోర్టుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నట్లు, తన వెంట ఉన్న అభిమానులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలని, కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు సంతోషం వ్యక్తంచేశాడు. కాగా, ఈ కేసు నడుస్తుండగానే విజయ్.. మోడల్, టెక్కీ అయిన కీర్తి పట్టాను 2010లో పెళ్లి చేసుకున్నాడు.
భృతి వివరాలు..
విజయ్–నాగరత్నకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లల పోషణ, చదువుల ఖర్చును పూర్తిగా విజయ్ చూసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే 2 నెలల్లో రూ.2 కోట్ల భృతిని నాగరత్నకు అందజేయాలని సూచించింది.
హైకోర్టులో మంజూరు
2013 నుంచి కలతల కాపురం


