● కుమారునిచే అంత్యక్రియలు
జరిపించాలన్న తల్లి
చింతామణి: భారీగా కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించినా భర్త, అత్తమామల ధనదాహం తీరలేదు. వారి వేధింపులను తట్టుకోలేక వివాహిత ఉరివేసుకొని అత్మహత్య చేసుకొన్న సంఘటన చింతామణి పట్టణంలోని సొణ్ణశెట్టిహశ్లి బడావణెలో శనివారం జరిగింది.
వివరాలు.. మృతురాలు మమతశ్రీ (26). పట్టణంలోని గణేష్నగరకి చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు మమతశ్రీని ఐదేళ్ల కిందట తాలూకాలోని భక్తరహళ్లికి చెందిన మోహన్రెడ్డికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తకు చేళూరు రోడ్డులో బైకు షోరూం ఉంది. మధ్యాహ్నం భోజనానికి రాగా ఇంటి తాళాలు వేసి ఉన్నాయి, కిటికీలో నుంచి చూడగా మమత ఫ్యాన్కు ఉరివేసుకుని శవమైంది. దీంతో భర్త పోలీసులు సమాచారమిచ్చాడు. పోలీసులు తనిఖీలు చేయగా డెత్నోట్ లభించింది. తన అంత్యక్రియలను భర్త కాకుండా కొడుకుతో నిర్వర్తించాలని రాసి ఉంది. భర్త ఎంతగా సతాయించాడో దీనిని బట్టి అర్థమవుతుంది. ఎస్పీ జగన్నాథ్ రై, తహశీల్దార్ సుదర్శన్ యాదవ్, సీఐ విజికుమార పరిశీలించి కేసు నమోదు చేశారు.
మోదీపై బీకే ధ్వజం
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక భారతదేశం అనేక సంక్షేభాలను ఎదుర్కొంటోందని కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్ అన్నారు. కేపీసీసీ కార్యాలయం ముందు జెండాను ఎగురవేసి మాట్లాడారు. రాజ్యాంగం కంటే సనాతన ధర్మమే ముఖ్యమని వాదించే ద్రోహుల సంఖ్య పెరుగుతోందని ఆరోపించారు. ముస్లింలపై చిన్న చూపు చూస్తోందన్నారు. కేంద్రం సర్ ద్వారా కోట్లాది మంది ప్రజల ఓటు హక్కును హరించిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో ఎవరూ చనిపోలేదని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించి, ఆ తరువాత ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను విడుదల చేసి, దానిని ఒక అపహాస్యంగా మార్చిందని అన్నారు. ప్రపంచలోనే అతిపెద్ద సంస్థ అని చెప్పుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, రిజిస్ట్రేషన్ అవసరం లేదని సిగ్గులేకుండా వాదిస్తోందన్నారు.
నదిలోకి కారు పల్టీ
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా గణపతి కట్ట వద్ద కారు అదుపుతప్పి హేమావతి నదీలోకి పల్టీ కొట్టింది, కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన దంపతులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కారు బండరాళ్ల మధ్య చిక్కుకోగా, స్థానికులు కారుకు తాడు కట్టి దంపతులను రక్షించారు. కళస పోలీసులు పరిశీలించారు.


