మైసూరు: చాముండి కొండపై నాడ శక్తిదేవత చాముండేశ్వరి మాత దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తులకు పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఆలయం ఎదురుగా అన్నదాన శిబిరం పెట్టి, కేసరిబాత్, అన్నం, సాంబారు పంపిణీ చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు, పిల్లలు, వృద్ధులకు పంపిణీ చేశారు.
భూమి డబ్బు కోసం భర్త హత్య
కోలారు: పొలం విక్రయించిన డబ్బులు ఇవ్వకపోవడం, ఉన్న మరికొంత పొలాన్ని కూడా అమ్మేస్తానని చెప్పడంతో కోపగించుకున భార్య.. భర్తను అంతమొందించింది. ఆపై స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన ఘటన బుధవారం కోలారు తాలూకాలోని చన్నసంద్ర గ్రామంలో జరిగింది. గ్రామవాసి నారాయణస్వామి (68) హతుడు కాగా, భార్యను పోలీసులు అరెస్టు చేశారు. భోజనంలో నిద్రమాత్రలు వేసి నిద్ర పోయిన తరువాత గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. నారాయణస్వామి ఇటీవల విక్రయించిన పొలం డబ్బులు అడిగినా ఇవ్వందుకు హత్య చేసినట్లు తెలిపింది. గత కొంతకాలంగా దంపతులు వేరుగానే ఉంటున్నారు. అయితే పొలం డబ్బు కావాలని ఆమె అతన్ని పట్టుబట్టగా తిరస్కరించాడు. మాట్లాడుదామని తోటలో ఉన్న ఇంటికి తీసుకు వెళ్లి ప్రాణాలు తీసింది. బుధవారం భీముని అమావాస్య పండుగ కావడంతో ఇంటింటా భర్తకు భార్య పాదపూజ చేయడం ఆనవాయితీ. అదే రోజు కాటికి పంపడం చూసి గ్రామస్తులు విస్తుపోయారు. వేమగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మొబైల్ గేమ్స్తో అప్పుల ఊబి.. వివాహిత ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: ఆన్లైన్ గేమ్లు, జూదాలకు బానిసై అప్పులు చేసిన వివాహిత చివరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. రంజిత (28) మృతురాలు. స్థానికంగా ప్రైవేటు కంపెనీలో కార్మికురాలైన రంజితకు, భర్త అరుణ్, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. గుల్బర్గాకు చెందిన వీరు 5ఏళ్ల క్రితం నెలమంగలకు వచ్చి స్థిరపడ్డారు. ఏడాది కాలంగా రంజిత మొబైల్లో ఆన్లైన్ గేమ్స్, జూదాలకు అలవాటుపడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. సుమారు రూ.15లక్షల వరకూ అప్పులు చేసింది. భర్త అరుణ్ ఎలాగో అప్పులన్నీ తీర్చాడు. అయినా రంజిత గేమ్స్ ఆడుతూ తిరిగి అప్పులు చేసింది. 2 రోజుల క్రితం భర్త పనిమీద గుల్బర్గాకు వెళ్లగా, రంజిత మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సీఎం రాజకీయ
కార్యదర్శిగా పొణ్ణప్ప
దొడ్డబళ్లాపురం: సీఎం డీకే శివకుమార్ రాజకీయ కార్యదర్శిగా ఎమ్మెల్యే ఏఎస్ పొణ్ణప్పను నియమితులయ్యారు. మొదట ఈయనను డిప్యూటీ స్పీకర్గా నియమిస్తారని హైకమాండ్ ప్రకటించింది, అంతలోనే పోస్టు మారిపోయింది. అధికార బదిలీ సమయంలో డీకే శివకుమార్, హైకమాండ్ మధ్య ఆయన వారధిలా పనిచేశారు. కొడగు జిల్లా నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా వర్తిస్తుంది. మరో సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండేకు కేబినెట్ హోదాతో సుగమ పాలన సంఘం (గుడ్ గవర్నెన్స్) అధ్యక్షునిగా నియమించారు.
శ్రీకాలభైరవాయ నమః
మండ్య: జిల్లాలోని నాగమంగల తాలూకా ఆదిచుంచనగిరి క్షేత్రంలో శ్రీకాల భైరవేశ్వరస్వామి ఆలయంలో మఠాధిపతి నిర్మలానందనాథ స్వామి నేతృత్వంలో బుధవారం భీమన అమావాస్య సందర్భంగా విశేష పూజలు జరిగాయి. శ్రీకాలభైరవేశ్వర స్వామి, స్తంభాంబిక దేవికి పూజలు, యాగాలు నిర్వర్తించారు. పెద్దసంఖ్యలో భక్తులు దీపాలను వెలిగించి పూజించారు. ఉత్సవ విగ్రహాలను వెండి తేరులో ప్రతిష్టించి ఊరేగించారు. మంత్రి హెచ్సీ బాలకృష్ణ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీకాలభైరవేశ్వర స్వామిని దర్శించుకున్నారు.


