శివాజీనగర: జాతీయ జెండాలు, చేగువెరా చిత్రాలు, నినాదాల పోస్టర్లు చేబూని యువజనం, కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు ఉత్సవాలు చేసుకున్నారు. తమ పోరాటంలో విజయం సాధించామంటూ పట్టరాని సంతోషంతో నృత్యాలు చేయడంతో ధర్నా స్థలి కోలాహలంగా కనిపించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ స్కాంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ కార్యకర్తలు, యువత ఫ్రీడంపార్క్లో నిరవధిక ధర్నా చేస్తుండడం తెలిసిందే. శనివారం వీకెండ్ కాగా వేలాదిగా తరలివచ్చారు, ఇదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలిసి ఆందోళనలో జెన్ జీ ఆనందోత్సాహాలు మిన్నంటాయి. జయజయ ధ్వానాలు చేస్తూ, అభినందనలు చెప్పుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.
వివాదాస్పద పోస్టర్లపై నిఘా
ధర్నాలో కొందరు వివాదస్పద, రెచ్చగొట్టే పోస్టర్లను ప్రదర్శించారని పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఒక విద్యార్థిని అల్లర్ల కేసుల నిందితులు ఉమర్ ఖాలిద్, షగ్జీల్ ఇమామ్లకు మద్దతుగా కూడిన పోస్టర్లను ప్రదర్శించింది. అలాగే బీఎల్ఆర్ పోలీస్– 609 అనే పదాలను ప్రదర్శించి, నగర పోలీసులపై విమర్శలు చేసింది. దీంతో కేసు పెట్టే యోచనలో ఉన్నారు.
ఎమ్మెల్సీ సీటీ రవిపై కేసు
యశవంతపుర: నీట్ పరీక్షకు– ముల్లాలకు ఏమిటీ సంబంధమని విమర్శించిన బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవిపై చిక్కమగళూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిక్కమగళూరులో జరిగిన ధర్నాలో సీటీ రవి మాట్లాడుతూ ఓ మతాన్ని కించపరిచారంటూ ఈ కేసు దాఖలైంది.
నినాదాలు, పోస్టర్లతో సందడి
ఆందోళనలో పాల్గొన్న ఓ గర్భిణి
ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు నివాళులు
ఫ్రీడంపార్క్లో ఉద్వేగం
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రాజీనామా ఫలితం


