శివమొగ్గ: వర్షాలకు పేరుపొందిన మల్నాడు ప్రాంతంలో రుతుపవన వానలు అరకొరగానే కురిశాయి. దీనివల్ల శివమొగ్గ జిల్లాలో లింగనమక్కి, భద్ర వంటి ముఖ్యమైన జలాశయాలు ఇప్పటికీ నిండలేదు. శనివారం ఉదయానికి ప్రధాన జలవిద్యుత్ కేంద్రమైన లింగనమక్కి డ్యాంలో నీటిమట్టం 1770.75 అడుగులుగా ఉంది (గరిష్ట మట్టం: 1819). 23,706 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, విడుదలను నిలిపివేశారు. గత సంవత్సరం ఇదే రోజున డ్యాంలో నీటిమట్టం 1806.40 అడుగులుగా ఉంది. ఈసారి 36 అడుగులు తక్కువగా ఉంది. మొత్తం 151.64 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఈ డ్యాంలో 40.58 టీఎంసీలే ఉన్నాయి. గతేడాది కంటే 112.81 టీఎంసీలు తక్కువ కావడం తీవ్రతకు అద్దం పడుతోంది.
భద్రాలోనూ అంతంతే
భద్రా డ్యాంలో నీటిమట్టం 152 అడుగులుగా ఉంది, (గరిష్ట మట్టం – 186 అడుగులు). 6472 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే, 176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం సామర్థ్యం 71.53 టీఎంసీలు అయితే సుమారు 36 టీఎంసీల నీరు చేరింది. గతేడాది ఇదే టైంలో 64.77 టీఎంసీలుండేవి. తుంగ డ్యాం నుంచి మాత్రమే నీరు విడుదలవుతోంది. మల్నాడు ప్రాంతంలో జూలై నెల మధ్యలో భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పుడలా లేదు. కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ఎండ బాగా కాస్తోంది. ఆగస్టులోనైనా మంచి వానలు పడతాయనే నమ్మకం ఉంది.
ప్రధాన జలాశయాలకు కటకటే


