● మండ్య జిల్లాలో కలకలం
మండ్య: మండ్య జిల్లాలోని మలవళ్లి తాలూకాలోని గుళఘట్ట గ్రామానికి చెందిన జి. శివరుద్ర (58) అనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురయ్యాడు. ఈయన స్థానిక ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. వివరాలు.. శుక్రవారం సాయంత్రం శివరుద్ర ఎప్పటిలాగే తన పొలం వద్దకు వాకింగ్కు వెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. చాలాసేపైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో గాభరాపడి గాలిస్తూ వెళ్లారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు అతని బైక్తో పాటు మృతదేహం ఒక గుంతలో లభ్యమైంది. మండ్య రూరల్ పోలీసులు స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ శోభరాణి, డీఎస్పీ యశ్వంత్ కుర్మా తదితరులు వచ్చారు. మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి పంపారు. మృతుని కుమారుడు వినయ్ మాట్లాడుతూ మహేష్ అనే వ్యక్తితో తన తండ్రికి గొడవలు ఉన్నాయని, అందువల్లే హత్య జరిగిందని ఆరోపించాడు. దుండగులు దారి కాచి హత్య చేసినట్లు అనుమానాలున్నాయి. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎమ్మెల్యే పి.ఎం. నరేంద్రస్వామి ఆయన మృతదేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చారు. గ్రామంలో భయాందోళన నెలకొనగా, పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
ప్రాచీన వీరగల్లుల లభ్యం
దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా భైరసంద్రలో గంగరాజుల కాలంనాటి వీరగల్లు శిలా శాసనాలు లభించాయి. వీటిని క్రీ.శ.850 నాటి పులివేట రాతి శాసనాలుగా గుర్తించారు. నెలమంగల తాలూకా భైరసంద్ర గ్రామంలోని రంగస్వామయ్య అనే వ్యక్తి తన పొలంలో దున్నుతుండగా ఈ శిలా శాసనాలు బయటపడ్డాయి. చరిత్రకారులు బాలసుబ్రమణ్య, వేదావతి, ధనపాల్, నరేంద్ర శిలా శాసనాన్ని పరిశీలించారు. శివమారనాడి అనే వ్యక్తి పులితో పోరాడుతూ వీరమరణం చెందడం, తరువాత అప్సరసలు ఆయనను స్వర్గానికి తీసికెళ్లడం, గంగరాజుల కాలం నాటి అక్షరాలతో రాతి పై లిఖించినట్లు తెలిపారు.
ప్రభుత్వ భూముల్లో
పండ్ల తోటలు: మంత్రి
శివాజీనగర: గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూమిలో పండ్ల తోటను అభివృద్ధి చేసి, దానిని అదే గ్రామ యువతకు ఏటా పారదర్శక వేలం ద్వారా లీజుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఈశ్వర్ బీ.ఖండ్రె ఆదేశించారు. పంచాయతీతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన ప్రభుత్వ భూముల్లో పండ్ల తోటల సాగు వల్ల ఆక్రమణలు కూడా ఆగిపోతాయి. ఈ ఉద్యాన వనాల ద్వారా ఉపాధి లభిస్తుందని తమ శాఖ కార్యదర్శికి లేఖలో సూచించారు.


