సాక్షి, బళ్లారి: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం. సత్యం, న్యాయం వైపు పత్రికలు పనిచేయాలని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. శనివారం బీదర్లో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, బీదర్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 40వ రాష్ట్ర పత్రికా సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పత్రికలు నిజాయితీగా పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం పరఢవిల్లుతుందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఒత్తిడికి గురికాకుండా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకుని రావాలన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తే ప్రభుత్వం స్పందించేందుకు దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, రహీంఖాన్, శరుణు ప్రకాష్ పాటిల్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన విలేకరులు పాల్గొన్నారు.


