హొసపేటె: కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు రూ.3000 మద్దతు ధర నిర్ణయించి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో రైతన్నలు కదం తొక్కారు. సాయిబాబా సర్కిల్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేత కాళిదాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం భారీ వర్షాల కారణంగా కారణంగా రైతులు అప్పులు చేసి రెండు సార్లు విత్తనాలు నాటాల్సి వచ్చిందన్నారు. పంట సరిగ్గా దిగుబడి రాక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాడైపోయిన పంటను కోసేందుకు రూ.4,500 చొప్పున కూలీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. దిగుబడి కూడా తక్కువగా ఉందన్నారు. మొక్కజొన్న పంట ఎకరాకు సగటున 5–6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎటువంటి పరిహారం చెల్లించకుండా రైతుల జీవితాలలో ఆడుకుంటున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మానేసి కనీస మద్దతు ధరను అందించడం ద్వారా రైతులకు సహాయం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను పెంచాలని, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని ఒత్తిడి చేశారు. నేతలు హెచ్.మహంతేష్, జే.ఉమాదేవి, మల్లికార్జున పాల్గొన్నారు.
మొక్కజొన్న ధర పతనం
యశవంతపుర: రాష్ట్రంలో ఈసారి చెరకుతో పాటు మొక్కజొన్నను రైతులు విపరీతంగా సాగు చేశారు. చెరకుకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించినా మొక్కజొన్నకు మాత్రం కల్పించలేదు. దీంతో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు నిర్ణయించిన కనీస మద్దతుధర(ఎంఎస్పీ) రూ.2400 ప్రకారం 10 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కేంద్రం నిర్ణయించిన రూ.2400 ధరతో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.600ను చేర్చి క్వింటాల్ను రూ.3000 ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి న్యాయమైన ధర లభిస్తుందని రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. రైతులు డిమాండ్ చేస్తున్న విధంగా క్వింటాల్కు మరో రూ.600లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అర్థంకాని పరిస్థితిలో రైతులున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో రైతులు ఎక్కువగా మొక్కజొన్నను సాగు చేశారు. కొందరు ప్రారంభంలో మంచి ధరలకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే అనేక మంది రైతులు గిట్టుబాటు ధర వస్తుందని ఎదురు చూస్తున్నారు.
హావేరిలో మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు
హొసపేటెలో రైతు సంఘం కార్యకర్తల ఆందోళన బాట
రాష్ట్రంలో పలు చోట్ల కదం తొక్కిన రైతులు
కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్
హావేరిలో రైతుల ధర్నా
దొడ్డబళ్లాపురం: మొక్కజొన్న పంటకు క్వింటాల్కు రూ.3000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ హావేరిలో జిల్లాధికారి కార్యాలయం ఎదుట రైతులు నిరవధిక నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మద్దతు ధర ప్రకటించడంతోపాటు తక్షణం కొనుగోలు కేంద్రాలు తెరవాలన్నారు. రైతుల సమస్యలపై ఎవరూ స్పందించడం లేదని, రైతుల ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
మొక్కజొన్నకు మద్దతు ధర ఏదీ?
మొక్కజొన్నకు మద్దతు ధర ఏదీ?
మొక్కజొన్నకు మద్దతు ధర ఏదీ?
మొక్కజొన్నకు మద్దతు ధర ఏదీ?


