
అక్రమ తవ్వకాలను అడ్డుకోలేరా?
రాయచూరురూరల్: జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఉప లోకాయుక్త అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రాయచూరు తాలూకా మిట్టి మల్కాపూర్ వ్దద ఉన్న గనులను సందర్శించారు. తక్కువ విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతి తీసుకొని ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు జరిపినట్లు ఆయన గుర్తించారు. అక్రమంగా తవ్వకాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పంట నష్టపరిహారం
అందించండి
రాయచూరురూరల్: అతివృష్టితో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కలబుర్గిలో మినీ విధానసౌధ వద్ద ఆందోళన నిర్వహించారు. అధ్యక్షుడు ఉమాపతి పాటిల్ మాట్లాడుతూ రాయచూరు, కలబుర్గి, యాదగరి, బీదర్ జిల్లాల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెసలు, కంది శనగలు, అలసంద పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అధికారులు సర్వే చేసి నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధికారిణి ఫౌజియ తరన్నమ్కు వినతిపత్రం సమర్పించారు. గురులింగ, నాగేంద్ర, రేవణ్ణ సిద్దప్ప, సిద్దరామ, జగన్నాథ్, బసవరాజ్, సంజు, చెన్నబసప్ప పాటిల్ పాల్గొన్నారు.
రక్తస్రావంతో బాలింత మృతి
రాయచూరురూరల్: రాయచూరు జిల్లాలో రక్తస్రావంతో ఓ బాలింత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బోగి రామనగుండకు చెందిన శివమ్మ (21)ను ప్రసవం కోసం శుక్రవారం దేవదుర్గ తాలూకా ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు వైద్యులు కాన్పు చేశారు. అయితే గర్భంలోనే శిశువు మృతి చెందింది. శివమ్మకు రక్తస్రావం అధికం కావడంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్ అస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. లోబీపీతో బాలింత మరణించినట్లు రిమ్స్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. బాలింత, శిశువు మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి వద్ద కుటుంబీకులు ఆందోళనకు దిగారు. రాయచూరు జిల్లాలో మెరుగైన వైద్యం అందక ఇటీవల కాలంలో పది మంది బాలింతలు మరణించినట్లు సమాచారం.
కేసుల పరిష్కారానికి
చొరవ చూపాలి
రాయచూరురల్: కక్షి దారులకు సత్వరం న్యాయం జరిగేలా చూడటంలో న్యాయవాదులు చొరవ చూపాలని ఉప లోకాయుక్త బీ.వీరప్ప సూచించారు. నగరంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆయన న్యాయవాదుల నుంచి సన్మానం అందుకొని మాట్లాడారు. కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా కక్షిదారులకు న్యాయం అందించాలన్నారు. నూతన న్యాయ చట్టాలపై యువ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,918 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. న్యాయమూర్తులు మారుతి బగాదే, స్వాతిక్, రమాకాంత్, శివాజీ అనంత నలవాడే, అరవింద్, మల్లికార్జున పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య
క్రిష్ణగిరి: అనారోగ్యంతో బాధపడుతూ ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుబరపల్లి వద్ద జరిగింది. వివరాల మేరకు.. క్రిష్ణగిరి జిల్లా కురుబరపల్లికి చెందిన మునిరాజ్ భార్య దీప (22) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ వచ్చింది. స్వస్థత కలగకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. బంధువులు ఆమెను చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్రమ తవ్వకాలను అడ్డుకోలేరా?

అక్రమ తవ్వకాలను అడ్డుకోలేరా?

అక్రమ తవ్వకాలను అడ్డుకోలేరా?