
తెల్లవారుజామునే తలుపు తట్టిన ఈడీ
బనశంకరి/చెళ్లకెర రూరల్: గతంలో ఈడీ దాడులు ఎదుర్కొన్న చిత్రదుర్గ ఎమ్మెల్యే, నటుడు దొడ్డణ్ణ అల్లుడు కేసీ.వీరేంద్ర(పప్పి) ఇళ్లు, కంపెనీలపై మరోసారి ఈడీ పంజా విసిరింది. అక్రమ నగదు బదిలీ ఆరోపణలతో శుక్రవారం వేకువజామునే ఈడీ అధికారులు బెంగళూరు, చిత్రదుర్గతో పాటు 17 చోట్ల దాడులు నిర్వహించారు. బెంగళూరు, చెళ్లకెరె, చిత్రదుర్గ, గోవాతో పాటు 17 చోట్ల దాడులు చేసి సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు ఫైళ్లను పరిశీలించారు. బెంగళూరు వసంతనగరలోని ఎమ్మెల్యే వీరేంద్ర ప్రైవేటు అపార్టుమెంట్, సహకారనగరలోని ఇళ్లపై దాడి చేశారు. చెళ్లకెరెలో ఎమ్మెల్యే నివాసంతో పాటు అతడి సోదరులైన కేసీ.నాగరాజ్ , కేసీ.తిప్పేస్వామి నివాసాల్లో 10 మంది ఈడీ అధికారుల సోదాలు చేపట్టారు. వీరేంద్ర యాజమాన్యంలో అనేక కంపెనీలను టార్గెట్గా చేసుకుని దాడి చేసిన ఈడీ అధికారులు రత్నా గేమింగ్ సొల్యూషన్స్, రత్నా గోల్డ్ కంపెనీ, రత్నా మల్టీస్టోర్స్ కంపెనీ, పప్పి టెక్నాలజీస్ కంపెనీ, పప్పి టూర్స్ అండ్ ట్రావెల్స్, పప్పి స్పేర్ బాక్స్ కంపెనీలపై దాడి చేశారు. ఎమ్మెల్యేకు చెందిన ఇళ్లలో కిలోకు పైగా బంగారం లభ్యమైంది. సిక్కిం పర్యటనలో ఉన్న వీరేంద్రను కోల్కతా ఈడీ బృందం అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకు వస్తుండగా ఎలాంటి సమయంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చిత్రదుర్గ, చెళ్లకెరెలో గేమింగ్ యాప్నకు సంబంధించి నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. గోవా రాజధాని పనాజీలో మెజిస్టిక్ ప్రైడ్ అనే క్యాసినో నిర్వహిస్తున్న హవాలా కుంభకోణం కింగ్పిన్ సుమందర్సింగ్ హుబ్లీ దేశపాండే నగరలోని కామాక్షీ అపార్టుమెంట్పై ఈడీ అధికారులు దాడి చేశారు. కర్ణాటక, గోవా, సిక్కింతో పాటు మొత్తం 17 చోట్ల ఒకే సారి ఈడీ అధికారులు దాడి చేసి కీలక ఫైళ్లు, పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, స్దిరచరాస్తుల ఆచూకీని కనిపెట్టారు. గతంలో 2016 డిసెంబరు 11 తేదీన కేసీ.వీరేంద్ర ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. బాత్రూమ్లో రూ.5 కోట్లకు పైగా నగదు, 30 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర ఇళ్లు, కంపెనీలపై దాడులు
కాంగ్రెస్ నాయకురాలి ఇంటిలో..
2023 శాసనసభ ఎన్నికల్లో రాజరాజేశ్వరినగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకురాలు కుసుమా హనుమంతరాయప్ప ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. వీరేంద్రపప్పితో ఆర్థిక వ్యవహారాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అన్నపూర్ణేశ్వరినగర ముద్దనపాళ్య నివాసం, చంద్రా లేఔట్లోని కార్యాలయంపై ఈడీ అధికారులు దాడి చేసి ఫైళ్లను పరిశీలించారు.

తెల్లవారుజామునే తలుపు తట్టిన ఈడీ