
మూడుముళ్లు.. ఆర్థిక చిక్కుముళ్లు
సాక్షి, బెంగళూరు: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. గతంలో ఇళ్ల దగ్గరే పెళ్లిళ్లు జరిపించేవారు. ఊరంతా పెళ్లికి సహకారం ఇచ్చేది. పెద్ద ఆడంబరం కూడా ఉండేది కాదు, ఖర్చు కూడా తక్కువే. నేటి డిజిటల్ యుగంలో పెళ్లి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. హంగు ఆర్భాటాలతో పెళ్లి ఒక విలాసం, ఖరీదైన కార్యక్రమంగా మారింది. చూడడానికి పైకి బాగానే ఉన్నా, లోపల అనేక ఇబ్బందులూ ఉన్నాయి. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో అన్ని నగరాలు, జిల్లాల్లో ఈ తరహా వ్యయ సంస్కృతి వెర్రితలలు వేస్తోంది.
ప్రతి దశలో ఖర్చే ఖర్చు
ఫంక్షన్ హాల్ కోసం లక్షలాది రూపాయల బాడుగలు చెల్లించాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్ హాళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మామూలుగా ఫంక్షన్ హాల్కు రూ. 30 నుంచి గరిష్టంగా రూ. లక్ష వరకు అద్దెలను చెల్లిస్తున్నారు. పెద్ద హాళ్లు, ఏసీ హాళ్లు అయితే రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు కూడా వసులు చేస్తున్నారు. పెళ్లి వేదిక కోసం సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
గొప్పల కోసం తిప్పలు
భోజనాల కోసం క్యాటరింగ్ సర్వీసెస్ వారికి ఇస్తున్నారు. మేళతాళాలు, ఫోటోలు, వీడియోలు.. ఇలాంటివాటికి మంచినీళ్లలా వ్యయమవుతుంది. పెళ్లికి ముందు, తరువాత రిసెప్షన్లకు సైతం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. అనేకమంది సమాజంలో గొప్పను చాటుకోవడానికి స్తోమతకు మించి ఖర్చు చేయడం పరిపాటైంది. పెళ్లి ఖర్చులు ఒక ఎత్తు అయితే బహుమతులు, కట్నాల రూపంలో మరింతగా ఆడపిల్లల తరఫు వారు ఖర్చు చేస్తున్నారు.
ఫోటోలు, క్యాటరింగ్..
పెళ్లి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు, డ్రోన్ కవరేజీ చేయిస్తుంటారు. ఆల్బంల తయారీకి రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల దాకా ఖర్చవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్ల పేరుతో మరింత వెచ్చిస్తున్నారు. క్యాటరింగ్స్లో ప్లేట్ భోజనానికి కనీసం రూ. 250 నుంచి రూ. 5 వేల వరకు వెచ్చిస్తున్నారు. చిన్న కుటుంబాలకు అయితే రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు భోజనాల ఖర్చు అవుతోంది.
పెళ్లిళ్ల కోసం రూ. లక్షల ఖర్చు
చేస్తున్న ప్రజలు
స్టేటస్ అంటూ అప్పుల పాలవుతున్న కుటుంబాలు
ఆపై ఆర్థిక ఇబ్బందులు
ఎంత గొప్పగా పెళ్లి చేస్తే సమాజంలో అంత పేరు ప్రతిష్టలని అనుకుంటున్నారు. స్టేటస్ అనే భ్రమలో చాలా మంది స్థాయికి మించి ఖర్చు పెడుతున్నారు. దీంతో అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పిల్లల పెళ్లిళ్ల కోసం, చేసిన అప్పులు తీర్చడం కోసం ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. సామాన్యులైతే అప్పులు తీర్చే మార్గం కనపడక, కుటుంబాల్లో కలహాలు జరుగుతుంటాయి. అందుకే అనేకమంది స్వామీజీలు పెళ్లిళ్ల ఖర్చును తగ్గించుకోవాలని, సరళంగా ఆచరించాలని బోధిస్తూ ఉన్నారు. ఈ దిశగా ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. పెళ్లి ఎంత ఆడంబరంగా జరిగింది అనే కంటే ఆ జంట ఎంత సజావుగా కాపురం చేస్తున్నారనేదే ముఖ్యమని స్వామీజీలు తెలిపారు.

మూడుముళ్లు.. ఆర్థిక చిక్కుముళ్లు

మూడుముళ్లు.. ఆర్థిక చిక్కుముళ్లు

మూడుముళ్లు.. ఆర్థిక చిక్కుముళ్లు