మెట్రో రైలులో భోజనం.. రూ.500 జరిమానా | - | Sakshi
Sakshi News home page

మెట్రో రైలులో భోజనం.. రూ.500 జరిమానా

Apr 29 2025 9:26 AM | Updated on Apr 29 2025 9:26 AM

మెట్రో రైలులో భోజనం.. రూ.500 జరిమానా

మెట్రో రైలులో భోజనం.. రూ.500 జరిమానా

దొడ్డబళ్లాపురం: నమ్మ మెట్రో ట్రైన్‌లో భోజనం తిన్నందుకు మహిళ రూ.500 జరిమానా కట్టాల్సి వచ్చింది. మెట్రో నిబంధనల్లో పేర్కొనని ఆహారం తీసుకోవడం నిషిద్ధమని, జరిమానా వర్తిస్తుందని ,మెట్రో తెలిపింది. ఇందుకు విరుద్ధంగా మెట్రోలో భోజనం చేసిన ఒక మహిళకు రూ.500 జరిమానా విధించినట్టు పేర్కొంది. మాదావర మెట్రో స్టేషన్‌ నుంచి మాగడి రోడ్డు మెట్రో స్టేషన్‌ వరకూ ప్రయాణించిన మహిళ మెట్రోలో క్యారియర్‌తీసి భోజనం ఆరగించింది. ఇది గుర్తించి జరిమానా వేశారు. రైలులో చిన్న చిన్న స్నాక్స్‌ తప్పించి టిఫిన్లు, భోజనాలు వంటివి చేయరాదని, అలాగే గుట్కా, సిగరెట్‌ వంటివి సేవించరాదని తెలిపారు.

భార్యా హంతకునికి జీవితఖైదు

మైసూరు: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదును విధిస్తూ మైసూరు 5వ అదనపు జిల్లా కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. పిరియా పట్టణ తాలూకాలోని భూదితిట్టు గ్రామానికి చెందిన స్వామినాయక నిందితుడు. సౌమ్యా అనే యువతిని స్వామినాయక్‌ 7 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్లపాటు ఇల్లరికం ఉన్నాడు, ఏడాది కిందట తన ఊరికి వచ్చి అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తరచూ గొడవపడేవాడు. 2022 ఆగస్టులో అతని అత్త మహాదేవి కుమార్తె– అల్లుని ఇంటికి వచ్చింది. గొడవ పడవద్దని బుద్ధిమాటలు చెప్పి వెళ్లింది. మరుసటి రోజునే స్వామినాయక భార్యను తీవ్రంగా కొట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు. పిరియా పట్టణ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. మైసూరు కోర్టులో కేసు సాగుతోంది. నేరం రుజువు కావడంతో గురురాజ్‌ ఈ మేరకు తీర్పు చెప్పారు.

వాలీబాల్‌ ఆటగాడు..

వల వేయడమే పని

బెళ్తంగడిలో అకృత్యాలు

యశవంతపుర: వాలీబాల్‌ నేర్పే నేపంతో విద్యార్థినులను లోబర్చుకుని లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న కామాంధుడు ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. దక్షిణకన్నడ జిల్లా కార్కళకు చెందిన సయ్యద్‌ నిందితుడు. బెళ్తంగడిలోని ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వాలీబాల్‌ ఆటగాడు కావడంతో విద్యార్థినులకు శిక్షణ పేరుతో వలలో వేసుకుని సన్నిహితంగా మెలిగేవాడు. అలా పెద్దసంఖ్యలో బాలికలను, యువతులను లోబర్చుకుని ఆ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని అడ్డుపెట్టుకుని మరింతగా వేధించేవాడు. తనకు లొంగని అమ్మాయిలకు అశ్లీల చిత్రాలను పంపేవాడు. కొన్ని వీడియోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇది బెళ్తంగడిలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హిందూసంఘాల కార్యకర్తలు సయ్యద్‌ను పట్టుకుని మందలించారు. అతని మొబైల్‌ను తీసుకుని పరిశీలించగా వందల వీడియోలు, ఫోటోలు బయటపడడంతో అలజడి రేగింది. అతనికి దేహశుద్ధి చేసి బెళ్తంగడి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

తాళి, జంధ్యంతోనే పరీక్షకు

శివాజీనగర: రైల్వే నియామక మండలిలో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల మంగళసూత్రం, జంధ్యంలను తొలగించరాదని రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ అధికారులకు సూచించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రైల్వే శాఖ నర్సింగ్‌ సూపర్‌డెంట్‌ ఉద్యోగానికి పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల సీఈటీ పరీక్షల్లో జంధ్యం తీసివేయించడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement