
పాకిస్తాన్తో యుద్ధం వద్దు
మైసూరు: పాకిస్తాన్తో యుద్ధం వద్దు, బదులుగా దేశ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంపొందించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. శనివారం మైసూరులోని తమ నివాసం ముందు, తరువాత పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. కశ్మీరు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన టోపీ పెట్టిందని ఎద్దేవా చేశారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీపై మండిపడ్డారు.
పాకిస్తానీలను సాగనంపాల్సిందే
రాష్ట్రంలో ఎంత మంది పాకిస్తానీయులు ఉన్నారో వివరాలు సేకరించి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని సీఎం అన్నారు. పాకిస్తానీయులను దేశం నుంచి పంపించేయాలనే కేంద్ర ప్రభుత్వ చర్యకు తమ మద్దతు ఉందని చెప్పారు.
గ్యారంటీలను ఆపం
ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారంటీ పథకాలను ఆపబోమని, వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని సీఎం అన్నారు. జిల్లాలోని పిరియాపట్టణలోని తాలూకా క్రీడాంగణంలో ఏర్పాటు చేసిన రూ.439 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం గావించారు.
కశ్మీర్ దాడి కేంద్ర నిఘా వైఫల్యమే
సీఎం సిద్దరామయ్య ధ్వజం