
మాజీ డీజీపీ ప్రాణాలు దక్కేవేమో
తీవ్ర మానసిక జబ్బుతో భార్య
చివరకు విషాదం
సాక్షి, బెంగళూరు: భార్యకు మానసిక అనారోగ్యం, ఇతరత్రా ఆస్తి గొడవలు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త పడి ఉంటే ఆ ఇంట ఘోరం జరిగేది కాదేమో అనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కేసులో అందరి నోటా ఇదే మాట వస్తోంది. ఆయన భార్య పల్లవి, కూతురు కృతిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. వారిద్దరూ మానసిక రోగాలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. పల్లవి 12 ఏళ్లుగా స్కిజోఫ్రినియా అనే డిప్రెషన్తో జీవిస్తోంది. ఓం ప్రకాశ్ ఆమెకు నగరంలోని ఓ ఆస్పత్రిలో మానసిక చికిత్స కూడా అందిస్తున్నారు. వైద్యానికి రూ. 40 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా సమాచారం.
దంపతుల మధ్య గొడవలను భార్య పల్లవి తరచూ పోలీసు అధికారులు గ్రూపుల్లో పలుమార్లు పోస్టు చేసినట్లు తెలిసింది. తన భర్త వద్ద అక్రమంగా తుపాకులు, మత్తు పదార్థాలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని, లేదంటే వాటితో తనను చంపేస్తాడని పల్లవి మెసేజ్లు పెట్టేది. ఇది చూసి పోలీసు అధికారులు అయ్యో పాపం అని విస్తుపోయేవారు. భర్త నన్ను వేధిస్తున్నాడు, ఆయనను అదుపు చేయకపోతే తానే చంపేస్తానని ఆ గ్రూపులో పల్లవి పోస్టు చేసేదని సమాచారం. దీనిని బట్టి ఓం ప్రకాశ్తో పాటు, ఆయన మిత్రులు ముందే అప్రమత్తమై ఉంటే ప్రాణాలు దక్కేవి. తేలిగ్గా తీసుకోవడంతో రక్తపాతం అనివార్యమైంది.
ఆత్మరక్షణ కోసమే..
తుపాకీ తీసుకుని చంపేస్తానని నా భర్త బెదిరించాడు, ఆత్మరక్షణ కోసం తాము పోరాటం చేయాల్సి వచ్చిందని, భర్త కంట్లో కారం పొడి చల్లినట్లు, శరీరంపై వేడి వంటనూనె చల్లినట్లు పల్లవి చెప్పినట్లు తెలిసింది. బీరు బాటిల్తో కొట్టి చేతులు, కాళ్లు కట్లేసి చాకుతో పొడిచినట్లు, కొద్ది నిమిషాలకే తీవ్ర రక్తస్రావంతో మరణించాడని పోలీసుల విచారణలో పల్లవి తెలిపింది. ఇక కుమార్తె కృతిని ప్రస్తుతం పోలీసులు నిమ్హాన్స్లో చేర్పించారు. దుందుడుకుగా ప్రవర్తించడం, ఏదేదో మాట్లాడడం చూసి పోలీసులు వైద్యులను ఆశ్రయించారు. నిమ్హాన్స్ వైద్యులు కృతి మానసిక ఆరోగ్యంపై పరీక్షలు చేస్తున్నారు. హత్యలో కృతి పాత్రపై కూడా లోతుగా విచారిస్తున్నారు.