కర్ణాటకలో మహారాష్ట్ర జోక్యం ఏంటి? | - | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో మహారాష్ట్ర జోక్యం ఏంటి?

Jan 18 2024 12:16 AM | Updated on Jan 18 2024 7:31 AM

సంగొళ్లి రాయణ్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి పటానికి నమస్కరిస్తున్న సీఎం సిద్దరామయ్య  - Sakshi

సంగొళ్లి రాయణ్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి పటానికి నమస్కరిస్తున్న సీఎం సిద్దరామయ్య

రాయచూరు రూరల్‌: కర్ణాటక సరిహద్దుల్లో మహారాష్ట్ర జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మహారాష్ట్ర సర్కార్‌కు సూచించారు. బుధవారం బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా సైనిక పాఠశాలలో సంగొళ్లి రాయణ్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటక సరిహద్దులోని 865 గ్రామాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయంపై ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు.

సైనిక పాఠశాలలో కన్నడిగులకు 65 శాతం, ఇతరులకు 35 శాతం సీట్లు కేటాయించామన్నారు. గుణాత్మక విద్యతో పాటు దేశభక్తిని పిల్లల్లో పెంచుతామన్నారు. సంగొళ్లి రాయణ్ణ జ్ఞాపకార్థం 110 ఎకరాల్లో ప్రభుత్వం నుంచి రాక్‌ పార్క్‌, వస్తు సంగ్రహాలయ నిర్మాణం చేపడుతామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలుపొందితే ఐదేళ్లు సీఎంగా ఎవరు కొనసాగుతారో పార్టీ తీర్మానం చేస్తుందన్నారు. బ్రిటిష్‌లపై పోరాడిన నేత సంగొళ్లి రాయణ్ణ కాగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దన్నారు.

బీజేపీ చేసిందేం లేదు
దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదని సీఎం ఆరోపించారు. రాయణ్ణను మోసంతో మన వాళ్లే బ్రిటిష్‌లకు అప్పగించారన్నారు. దేశ భక్తులంటే ప్రజలను ప్రేమించే వారన్నారు. నేడు బీజేపీ కులాలు, మతాల మధ్య ఘర్షణలు రాజేసిందని విమర్శించారు. బసవణ్ణ, అంబేడ్కర్‌లు కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరూ సమానమనే భావనలు కలిగిన వారన్నారు. మనిషి ద్వేషం వీడాలన్నారు. నేడు మసీదులు ధ్వంసం చేయమని సలహాలు ఇచ్చేవారున్నారన్నారు. సమాజంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో నైపుణ్యతను సాధించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పంచ గ్యారెంటీలతో అందరికీ మేలు జరిగిందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు సహజమన్నారు. వాటిని లెక్కచేయకుండా ఉచిత పథకాలను ప్రజలకు అందించడం తమ కర్తవ్యమన్నారు. ఉత్సవాల్లో స్వామీజీలు గురులింగ శివాచార్య, మడివాళ రాజయోగీంద్ర, నిరంజనానందపురి, మంత్రులు సతీష్‌ జార్కిహోళి, శివరాజ్‌ తంగడిగి, బైరతి సురేష్‌, శాసన సభ్యులు మేటి, అశోక్‌ పట్టణశెట్టి, మాజీ ఎమ్మెల్యేలు రేవణ్ణ, అంజలి నింబాళ్కర్‌, ప్రకాష్‌ హుక్కేరిలున్నారు.

సీఎం సిద్దరామయ్య

Advertisement
 
Advertisement
Advertisement