శివాజీనగర: బెంగళూర శివాజీనగరలోని రస్సెల్ మార్కెట్ ప్రాంతంలోని ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు సోమవారం పునఃప్రారంభమైంది. పోలీసు భద్రత నడుమ పాలికే అధికారులు పనులు చేపట్టారు. ఇంజనీర్ మాధవరావు ఏఈఈ రుచిత, ఏఈ సావిత్రి ఆధ్వర్యంలో ధర్మరాజ టెంపుల్ స్ట్రీట్, రస్సెల్ మార్కెట్ రోడ్డు, చర్చి రోడ్డులలోని ఫుట్పాత్లపై ఉన్న కట్టడాలను జేసీబీలతో కూల్చివేయించారు. పోలీసులు ఆద్యంతం వీడియో రికార్డింగ్ నిర్వహించారు. వారం కిందటే ఇక్కడే ఆక్రమణలను తొలగిస్తుండగా కొందరు దాడి చేయడం తెలిసిందే. దీంతో పెద్ద రభస చెలరేగింది. ఏఈ సావిత్ర మాట్లాడుతూ ఆ రోజు దుండగులు నాపై పెప్పర్ స్ప్రే చేశారు, బయటి వాళ్లే ఆ పని చేశారు. ఇక్కడి స్థానికులు మాకు మంచి సహకారం అందిస్తున్నారు. కొన్ని చోట్ల వారే సొంతంగా ఆక్రమణలను తొలగించారు అని చెప్పారు. రస్సెల్ మార్కెట్ ప్రాంతంలో ఫుట్పాత్లపై చాలా ఆక్రమణలు ఉన్నాయని, తొలగిస్తామని చెప్పారు. ఘర్షణ నేపథ్యంలో చుట్టుపక్కల పోలీసు బందోబస్తు మధ్య పనులు జరిగాయి.
బెంగళూరు శివాజీనగరలో కార్యాచరణ


