బనశంకరి: కర్ణాటకలో కావేరి నదిపై మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణానికి పొరుగురాష్ట్రం తమిళనాడు సమ్మతి లేదా అనుమతి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటకకు భారీ ఉపశమనం దక్కింది. సోమవారం రాజ్యసభలో తమిళనాడు ఎంపీ అన్బుమణి రామదాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రజలశక్తి మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. కావేరి జలాలపై 2018 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. కావేరి నదిపై చేపట్టే పథకాలకు కింది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచేరి ఆమోదం తీసుకోవడం తప్పనిసరి అని ప్రస్తావించారా?, మేకెదాటుకు కర్ణాటక ఆమోదం తీసుకుందా? తెలపాలని రామదాస్ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టే చెప్పింది
కేంద్రమంత్రి బదులిస్తూ, సుప్రీంకోర్టు అంతిమ తీర్పులో.. నది ఎగువన కర్ణాటక కట్టే ప్రాజెక్టులకు దిగువ రాష్ట్రాలనుంచి అనుమతి తీసుకోవాలని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ట్రైబ్యునల్ ఆదేశాలకు ఎలాంటి భంగం కలగకుండా తమ రాష్ట్ర పరిధిలో నీటి వినియోగం లేదా నీటి పారుదల సౌలభ్యాలకు పూర్తి హక్కు ఉంటుందని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం 2019లో అందించిన మేకెదాటు జలాశయం, తాగునీటి పథకం డీపీఆర్ను వెనక్కి ఇచ్చేశామని వివరించారు. కావేరి అథారిటీ మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్ను రూపొందించి మళ్లీ అందించాలని సూచించామని చెప్పారు.
కింది రాష్ట్రాల సమ్మతి
అవసరం లేదు
కేంద్ర ప్రభుత్వం
ప్రకటనతో కర్ణాటకకు ఊరట


