పిల్లలకు ఏమివ్వాలో తల్లికి తెలుసు: డీకే.శివకుమార్
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిది. పిల్లలకు ఏమి ఇవ్వాలనేది తల్లికి తెలుసని కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ అన్నారు. నూతన సీఎం ఎంపికపై చర్చించేందుకు హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన బెంగళూరులోని సదాశివనగర తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ...
తాను తన దేవుడిని కలిసేందుకు దేవాలయానికి వెళ్తున్నానని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తనను ఒక్కడినే ఢిల్లీకి రావాలని తెలిపారని, తన ఆరోగ్యం కుదుటపడిందని, ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించామని, వారు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామన్నారు. హైకమాండ్ను ముఖ్యమంత్రి స్థానం కోరుతారా అన్న ప్రశ్నకు తాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించాను.
135 స్థానాలను గెలిపించి ఇచ్చాను అంతే అని ఆయన సమాధానమిచ్చారు. తాను వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ చేయనని డీకేశి అన్నారు. తమది ఐకమత్యం కలిగిన ఇల్లు అని, తమ సంఖ్య 135 ఏ ఒక్కరిని విడగొట్టే పని చేయనని చెప్పారు.