
సాక్షి బెంగళూరు: ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటోందని తెలుస్తోంది. సర్వేలను చూసి కాంగ్రెస్ మురిసిపోతోంది. అధికారంలోకి రాబోతున్నట్లు ధీమాగా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని, గతంలో కూడా ఇలా ఎగ్జిట్పోల్స్లో చెప్పినదానికి వ్యతిరేకంగా జరిగిన దాఖలాలు ఉన్నాయని అధికార బీజేపీ వాదిస్తోంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113 గనుక రెండు జాతీయ పార్టీల్లో ఏదొక పార్టీ సొంతం చేసుకుంటే ఆపరేషన్ ఆకర్ష్కు అవకాశం ఉండకపోవచ్చు. కానీ మేజిక్ నంబర్కు దగ్గరగా వచ్చి ఆగిపోతే మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తారు.
ఆ గాలం నుంచి సొంత పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడమే పార్టీల ప్రధాన కర్తవ్యంగా మారుతుంది. దీంతో రిసార్ట్ రాజకీయాలకు తెరలేపే అవకాశం ఉంది. సొంత బలం మీదే అధికారంలోకి వస్తామని రెండు జాతీయ పార్టీలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ హంగ్ వస్తే పరిస్థితి ఏంటని రెండు పార్టీలు లోలోపల మదన పడుతున్నాయి. గతంలో ఆపరేషన్ కమల ద్వారా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని ఎమ్మెల్యేలను రెండు సార్లు తమ వైపు ఆకర్షించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి అలాంటి ఆపరేషన్ కమలకు తావివ్వకూడదని కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతోంది. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఆపరేషన్ హస్తం నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023)
హంగ్ పరిస్థితులు తలెత్తితే ఆపరేషన్ కమల, ఆపరేషన్ హస్తం ద్వారా జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కువగా గాలం వేస్తారు. కాబట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం జేడీఎస్ పార్టీకి పెద్ద సవాలుగా మారనుంది. ఈ క్రమంలో మళ్లీ తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు కూడా పార్టీలు వెనుకాడవు. ఇప్పటికే తమ తమ పార్టీల్లో కచ్చితంగా గెలుస్తారనుకునే నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారిని నిలబెట్టుకునేందుకు ఒకవైపు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏదీఏమైనా అంతిమంగా అధికారమే పరమావధిగా ఏయే ఎమ్మెల్యేలు, నేతలు ఏయే పార్టీల వైపు మొగ్గుచూపుతారో చెప్పేందుకు ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాదు. ఈ అనుమానాలన్నింటికి నేడు శనివారం జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.
కాంగ్రెస్ గెలిస్తే..
ఎగ్జిట్ పోల్స్ నిజమై కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిస్తే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలతో సీఎల్పీ భేటీ జరిపి తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, జి.పరమేశ్వరలు సీఎం రేసులో ముందంజలో ఉన్నారు.
బీజేపీ విజయం సాధిస్తే..
పాలన వ్యతిరేకతను అధిగమించి మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మరోసారి సీఎం బసవరాజు బొమ్మాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల వరకు సీఎం విషయంలో మార్పు ఉండకపోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెరొక ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉంది.
స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి
శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని సర్వేల్లో వెల్లడైంది. దీంతో స్వతంత్ర అభ్యర్థులపై కాంగ్రెస్, బీజేపీలు దృష్టి పెట్టాయి. గెలుపొందుతారనే నమ్మకం ఉన్న స్వతంత్రులను సంప్రదిస్తున్నారు. ధార్వాడ జిల్లా కుందగోళ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఎస్ఐ చిక్కనగౌడను ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సంప్రదించారు. గదగ్ జిల్లా శిరహట్టి నియోజకవర్గలో పోటీచేసిన రామకృష్ణ దొడ్డమని, విజయనగర జిల్లా హరపనహళ్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న లతా మల్లికార్జున్, పులకేశీనగర నియోజకవర్గ నుంచి పోటీ చేసిన అఖండ శ్రీనివాసమూర్తిను ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సంప్రదించి మద్దతు కోరారని తెలుస్తోంది.
మేజిక్ నంబర్ దాటకపోతే
అన్ని పరిస్థితులు తారుమారై మేజిక్ నంబర్కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేరుకోలేకపోతే జేడీఎస్ పార్టీ మరోసారి కింగ్మేకర్గా అవతరిస్తుంది. హంగ్ పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై సందిగ్ధత ఏర్పడనుంది. ఆ తర్వాత జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ, కుమారస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శ్రమించాల్సి వస్తుంది. ఆ తర్వాత జేడీఎస్ పార్టీ డిమాండ్లకు ఒప్పుకోవడం తప్పించి వేరే దారి జాతీయ పార్టీలకు ఉండకపోవచ్చు. గతంలో కూడా కుమారస్వామి సీఎం స్థానం ఇవ్వడంతో బీజేపీ,కాంగ్రెస్ పార్టీతో చెరొకసారి జతకట్టారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి పీఠం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంతిమంగా రెండు జాతీయ పార్టీలు ఇచ్చే ఆఫర్లను బేరీజు వేసుకుని ఎవరికి జై కొట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.