
సాక్షి,బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లోనే ఓటర్లకు డబ్బులు ఎక్కువగా పంపిణీ చేసిన నియోజకవర్గాల్లో బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాలు నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారని సమాచారం. బళ్లారి సిటీలో 2,59,184 మంది ఓటర్లు ఉండగా, ఇందులో దాదాపు 2 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల బరిలో ప్రధానంగా తలపడిన ముగ్గురు అభ్యర్థులు నుంచి ఒక్కో ఓటరుకు రూ.5 వేల దాకా చేరినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీ తరపున పోటీ చేసిన ప్రధాన అభ్యర్థి ద్వారా ఓటర్లకు పెద్ద ఎత్తున నగదు చేరడంతో ఎటు చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలో 2,38,326 మంది ఓటర్లు ఉండగా, ఈ నియోజకవర్గంలో కూడా జాతీయ పార్టీల తరపున బరిలో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు నుంచి మూడు వేలు పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. నగదుతో పాటు ఒక్కో ఇంటికి ఒక్కో కోడిని కూడా పంపిణీ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక్కో ఇంటికి నాలుగు ఓట్లు ఉంటే రూ.25 వేలు నుంచి రూ.30 వేలు దాకా పంపిణీ జరిగినట్లు నగరంలో జోరుగా చర్చ వినిపిస్తోంది. రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు దాదాపు రూ.250 కోట్లు పంపిణీ చేసినట్లు సమాచారం. చివరకు ఓటరు దేవుళ్లు ఎవరికి ఓటు వేస్తారనేది ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ తమ్ముళ్లు డబ్బులు పంపిణీలో కీలకం :
బళ్లారి నగరానికి పొరుగున రాయదుర్గం నియోజకవర్గం ఉండటంతో రాజకీయంగా, వ్యాపారంగా ఇక్కడి, అక్కడి నేతలకు సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బళ్లారి సిటీ నుంచి బరిలో ఉన్న జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి తరపున డబ్బులు పంపిణీ చేయడానికి పొరుగున రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చి నగదు తీసుకుని ఓటర్లకు పంపిణీ చేసినట్లు నగరంలో ప్రచారం జరుగుతోంది.