● ఐలాండ్–2లో ఎన్టీపీసీ బృందం సందడి
● తెలంగాణ టూరిజం ఆతిథ్యం అద్భుతమని ప్రశంసలు
గోవిందరావుపేట: ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు అందాలు, ఐలాండ్ల ప్రత్యేకతలు రామగుండం ఎన్టీపీసీ ఉన్నతాధికారులను ఆకట్టుకున్నాయి. రామగుండంలోని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సమంత తదితర ఉన్నతాధికారులు శనివారం లక్నవరం సరస్సును సందర్శించారు. ఐలాండ్–2లో బోటింగ్ చేశారు. ప్రకృతి అందాల నడుమ రాత్రి క్యాండిల్ లైట్ డిన్నర్ ఆస్వాదించి అక్కడే బసచేశారు. ముందుగా ఉన్నతాధికారులకు కోయ బృందంతో స్వాగతం పలికారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల మధ్య రాత్రిబస చేయడం తమకు మంచి అనుభూతిని కలిగించిందని ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేశారు. లక్నవరం ప్రకృతి సోయగాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెలంగాణ టూరిజం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం హోటల్స్ జీఎం కె.నాథన్, అజీమ్ జంగయ్య, లక్నవరం హరిత మేనేజర్ శివశంకర్, హెచ్వోడీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


