● మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
శంకరపట్నం: ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తలేరని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం కాచాపూర్లో శనివారం పీహెచ్సీని ప్రారంభించి మాట్లాడారు. కల్వల ప్రాజెక్ట్గండి మరమ్మతుకు రూ.36కోట్లు మంజూరు చేశానని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరన్నారు. పదేళ్లు పాలించి ఉచిత బస్సు, 200 యూనిట్ల విద్యుత్, డబుల్బెడ్రూం ఇవ్వనందుకు గత ప్రభుత్వాన్ని, మాజీ ఎమ్మెల్యేను ఏ చెప్పుతో కొట్టాలి అని ప్రశ్నించారు. రసమయికి పైనుంచి కింద వరకు అబద్ధాలేనని, అసత్య ఆరోపణలు చేస్తే వీపు విమానం మోగుతుందని ఘాటుగా విమర్శించారు. తాను ఎవరి పేరు మీద వసూళ్లు చేయలేదని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
క్యాంప్లను సమర్థవంతంగా నిర్వహించాలి
కరీంనగర్ కార్పొరేషన్: లోక్ కల్యాణ్ మేళాలో భాగంగా వీధి విక్రయదారులకు ఈనెల 1నుంచి 30 వరకు చేపట్టిన క్యాంపులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మెప్మా అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, సీవోలతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల యూనిఫాం స్టిచింగ్, స్ట్రీట్ వెండర్ క్యాంపులు, సోషల్ సెక్యూరిటీ స్కీంలు, ప్రభుత్వం అందించిన పెండింగ్ చీరల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు కుడుతున్న యూనిఫాంలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గతంలో మహిళలకు కానుకగా అందించిన పెండింగ్ చీరలు ఏమైనా ఉంటే వాటి పంపిణీ ప్రక్రియను పూర్తిచేసి, ఆన్లైన్ లాగిన్లో ఫొటో క్యాప్చర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లోక్ కల్యాణ్ కార్యక్రమంలో భాగంగా క్యాంపులు నిర్వహించాలన్నారు. ఎస్ఐఆర్ నోటీసుల పరిష్కార ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు. మెప్మా పీడీ స్వరూపరాణి, డీఎంసీ శ్రీవాణి, సునీత, స్వప్న, మంజుల, పద్మ, దీప పాల్గొన్నారు.
12న జాతీయ లోక్ అదాలత్
కరీంనగర్ క్రైం: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను రాజీమార్గంలో సత్వరమే పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ వెల్లడించింది. జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులు, కుటుంబ వివాదాల కేసులు, చెక్కుబౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు, చిట్ఫండ్ కేసులు ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుదన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


