కరీంనగర్: పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్య వ్యవస్థ నిధుల లేమితో విలవిల్లాడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకే కాకుండా పొరుగు జిల్లాల పేదలకు సంజీవనిలా నిలుస్తున్న ‘కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి’ (జీజీహెచ్)లో ప్రస్తుతం దయనీయ పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ పథకం నిధుల విడుదలలో పాలకుల నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. జీజీహెచ్కు రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు దాదాపు రూ.4 కోట్లు బకాయి పడటంతో ఆస్పత్రి నిర్వహణ, శస్త్రచికిత్సలకు విఘాతం ఏర్పడింది.
నిలిచిన శస్త్రచికిత్సలు
కరీంనగర్ ఆస్పత్రిలో ప్రతినెల వందలాది మంది పేద రోగులకు వివిధ రకాల శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) జరుగుతుంటాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద సర్కారు ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించినప్పుడు ఆయా ప్యాకేజీల ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన నిధులు రూ.4 కోట్లకు చేరుకున్నాయి. వీటితో పాటు ఆస్పత్రి అభివృద్ధి నిధులు సైతం మంజూరు కాకపోవడంతో జీజీహెచ్ పాలన పడకేసింది.
చేతులెత్తేసిన ఏజెన్సీలు
జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్టీ వంటి విభాగాల్లో ఆపరేషన్లు చేయడానికి ఇంప్లాంట్లు, సర్జికల్ మెటీరియల్, ఇతర అత్యవసర మందులు, ఉపకరణాలు అవసరం. వీటిని వివిధ ప్రైవేటు ఏజెన్సీలు ఆసుపత్రికి సఫరఫరా చేస్తుంటాయి. ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం మూడేళ్లుగా ఈ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడం లేదు. పదే పదే తిరిగినా ఫలితం లేకపోవడంతో సర్జికల్ ఏజెన్సీలు ఆపరేషన్ మెటీరియల్ సరఫరా పూర్తిగా నిలిపివేసి, శ్రీమావల్ల కాద్ఙు అని చేతులెత్తేశారు. మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లలో కీలకమైన శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి.
నిధులొస్తే మెరుగైన సేవలు
ఆరోగ్యశ్రీ నిధులు రూ.4.5 కోట్లు విడుదలైతే ఖరీదైన శస్త్రచికిత్సలు చేపట్టే అవకాశముంది. ఆపరేషన్లకు ఇంప్లాంట్స్ కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో మోకీలు మార్పిడి వంటి ఖరీదైన ఆపరేషన్లు చేశాం. నిధులు విడుదల కాకపోవడంతో ఇంప్లాంట్స్ కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. గతంలో మెటీరియల్ సరఫరా చేసిన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ నిధులు త్వరలో విడుదలైతే మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. – డాక్టర్ వీరారెడ్డి,
సూపరింటెండెంట్, జీజీహెచ్


